26, అక్టోబర్ 2014, ఆదివారం

రామయ్య, సోమయ్యల కథ !


అనగా అనగా ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే అన్నదమ్ములు ఉండే వారు. వారిలో రామయ్య పేదరికంతో బాధ పడుతూ ఉండే వాడు. ఒక చిన్న గుడిసెలో సాదాసీదా జీవితం గడుపుతూ ఉండే వాడు. సోమయ్య మాత్రం వ్యవసాయం మీదా, వ్యాపారాల మీదా బాగా సంపాదించి,  విలాసవంతమయిన జీవితం గడుపుతూ ఉండే వాడు. పెద్ద భవంతి కట్టుకుని అందులో భార్యా పిల్లలతో దర్జాగా గడుపుతూ ఉండే వాడు. రామయ్య  భార్య ఒంటి మీద ఒక్క పసుపు తాడు తప్ప వెండి బంగారాలేమీ ఉండేవి కావు. పిల్లలకి కూడా మంచి బట్టలు ఉండేవి కావు.  అయినా సరే,  ఆ కుటుంబంలోని వారంతా  ఏ విచారమూ లేనట్టుగా ఎంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉండే వారు. నిత్యం ఆనందంగానే కాక, పూర్తి ఆరోగ్యంగా కూడా ఉండే వారు.
       సోమయ్య  కుటుంబం మాత్రం ఎంత సంపద న్నా సరే నిత్యం ఏదో అసంతృప్తితో రగిలి పోతూ ఉండేది.  అతని భార్యకు ఎన్ని నగలు, ఎన్ని చీరలు  ఉన్నా, ఇంకా చాలవని భర్తను వేధిస్తూ ఉండేది.అతని పిల్లలు కూడా దుబారా ఖర్చులకు అలవాటు పడడంతో ఎంత డబ్బూ చాలేది కాదు. రోజూ ఇంట్లో  అంతా దేనికో ఒకదానికి గొడవ పడుతూ ఉండే వారు.  అంతే కాదు, తరచుగా వారు ఏదో ఒక రోగాన పడుతూ ఉండే వారు. రామయ్య ఇంటికి వచ్చిన అతిథులకు కలిగినంతలో పెట్టి తృప్తి పరచి పంపుతూ ఉండే వాడు. సోమయ్య  సంగతి తెలిసి ఆ ఇంటికి ఎవరూ వచ్చే వారు కాదు. అంత పెద్ద భవనమూ బోసి పోయి ఉండేది.
      ఏమీ లేక పోయినా,  అన్నగారి కుటుంబం అంత ఆనందంగా ఎలా ఉండ గలుగుతోందో తెలుసు కోవాలని  సోమయ్యకు కుతూహలంగా ఉండేది. అయితే, డబ్బుందనే అహంకారంతో  బంధుత్వాన్ని ప్రక్కన పెట్టిన సోమయ్యకు  అన్న గారిని ఆ విషయం అడగడానికి ముఖం చెల్లేది కాదు !
    ఇలా ఉండగా, ఒక రోజు మునిమాపు వేళ రామయ్య దారంట పోతూ ఉంటే, అతని కాలిలో ముల్లు గుచ్చకుంది. బాధతో ‘‘ అమ్మా !’’ అని, అంత లోనే తేరుకుని, ముఖంలో ప్రశాంతత తెచ్చుకున్నాడు. ఇదంతా అతని వెనుకగా  నడచి వస్తున్న   సోమయ్య కంట పడింది. ఆశ్చర్య పోయాడు ! ఇక ఉండబ్టట లేక, అన్న గారిని ముల్లు గుచ్చుకున్న బాధను అంత లేనే ఎలా మరచి పోగలిగావని అడిగాడు.
    దానికి రామయ్య నవ్వుతూ  ఇలా అన్నాడు : ‘‘ముల్లు గుచ్చు కుంటే ఎవరికయినా బాధ కలగడం సహజమే తమ్ముడూ ! కానీ ఇప్పుడు నాకీ ముల్లు కాలిలో గుచ్చు కుంది కానీ , కంట్లో గుచ్చుకో లేదు కదా ! అనే ఆలోచన వచ్చింది. అందుకే క్షణంలో నా బాధంతా చేత్తో తీసి పారేసినట్టయింది! ’’ అనిచెప్పాడు.
     అన్న గారి కుటుంబం అంత ఆనందంగా ఎలా ఉండ గలుగుతోందో  ఆ మాటలతో అర్ధమయింది సోమయ్యకి ! కలిగినంతలో తృప్తి పడడం, బాధలోనూ సుఖం వెతుక్కోడం వల్లనే తమ్ముడి కుటుంబం అంత ఆనందంగా ఉంటోందని అతనికి అర్ధమయింది. అహంకారంతో అందరినీ దూరం చేసు కోకుండా, నలుగురితో కలిసి మెలసి ఉంటే , ఆ యింట సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని కూడా గ్రహించాడు.      ఆ రోజు నుండీ  సోమయ్యలో మంచి మార్పువచ్చింది., భార్యా పిల్లలకి నచ్చ చెప్పివారిలో  కూడా మంచి మార్పు తీసుకొచ్చేడు. అన్న గారి కుటుంబంతో చక్కగా రాకపోకలు సాగించేడు.    
  ఇప్పుడు ఆ అన్నదమ్ముల అన్యోన్యతని మెచ్చుకోని వారంటూ  లేరు ! 

కామెంట్‌లు లేవు: