15, సెప్టెంబర్ 2014, సోమవారం

భలే తీర్పు !


అనగా అనగా ఒక ఊరిలో ఒక జమీందారు ఉండే వాడు. అతని పేరు కృష్ణయ్య. ఊర్లో ఎవరికి ఏ తగవు వచ్చినా, రెండు పక్షాల వారి వాదనలనూ విని,  చక్కగా తీర్పు చెప్పే వాడు.  అతని తీర్పనకు ఎదురు ఉండేది కాదు ! కృష్ణయ్య చెప్పే తీర్పులు వినడానికి  గ్రామం లోని వారే కాకుండా, చుట్టు ప్రక్కల ఊర్లనుండీ జనం విరగబడి వచ్చే వారు ! అతను చెప్పిన తీర్పుల లోని సబవు గురించి రోజుల తరబడి మెచ్చుకుంటూ  మాట్లాడుకునే వారు.
    ఒక రోజు కృష్ణయ్య దగ్గరకు ఊర్లో ఉండే ఇద్దరు వ్యక్తులు వచ్చేరు.  వారిలో ఒకడి  పేరు రామయ్య. రెండో వాడు సోమయ్య.
    మందుగా రామయ్య తన గోడు ఇలా చెప్పు కున్నాడు : ‘‘అయ్యా ! నా పేరు రామయ్య. పెద్ద వీధిలో ఉంటాను. ఇతడు నా దగ్గర పని వాడు. పేరు సోమయ్య. ఇతనికి జీతం బాగానే ముట్ట చెబుతున్నాను. తిండీ బట్టా ఇస్తున్నాను. చక్కగా చూసు కుంటున్నాను.కానీ, ఇతడి బుద్ధి మంచిది కాదు. మొదట్టో బాగానే ఉండే వాడు కానీ, ఇటీవలే మారి పోయాడు. నాకు అనుమానం కలిగి, ఇతని బుద్ధి తెలుసు కోవాలను కున్నాను.
   నిన్న ఉదయం మా ఇంటి గదిలో అందరికీ కనబడే లాగున ఓ వెండి భరిణె ఉంచాను. తలుపు చాటు నుండి చూస్తున్నాను.వీడు అటూ, యిటూ దొంగ చూపులు చూస్తూ ఉండడం గమనించాను. వీడు ఆ వెండి భరిణెని తటాలున తీసి పంచె చాటున దాచేసుకుని ఏమీ ఎరగనట్టు వీధి లోకి వెళ్ళి పోబోతూ ఉంటే పట్టు కున్నాను. వీడు బిగ్గరగా ఏడుస్తూ తన తప్పు ఒప్పు కున్నాడు. వెంటనే పని లోనుండి తీసి వేసాను. వీడు మాత్రం తన తప్పును అంగీకరిస్తూనే, తనని పని లోనుండి మాత్రం తీసెయ్య వద్దని జలగ లాగా పట్టు కుని వదలడం లేదు !
వీడి బుద్ధి బయట పడ్డాక కూడా వీడిని పనిలో ఎలా పెట్టు కోగలను తమరే తీర్పు చెప్పండి ! ’’ అన్నాడు.
    సోమయ్య తను వెండి భరిణె దొంగతనం చేసి నటట్టుగా అంగీకరించేడు.  లోగడ ఎప్పుడూ అలాంటి దొంగ పనులు చేయ లేదని ఏడుస్తూ చెపాడు. అదే మొదటి సారి అనీ, తన సంపాదన చాలక పోవడంతో  ఇంటి దగ్గర పరిస్థితులు చాలా  దారుణంగా ఉన్నాయని ఏడుస్తూ  ఇలా చెప్పాడు.. ‘‘ఆ సమయంలో  నా బాధలన్నీ గుర్తుకు వచ్చి. అనుకోకుండా  వెండి భరిణె కనబడడంతో మనసు కట్టుకో లేక దానిని దొంగిలించాను. తప్పయింది. కనికరించండి.. ఇప్పుడు రామయ్య గారు నన్ను పని లోనుండి తీసేస్తే మా కుటుంబానికి ఆత్మ హత్యలు చేసు కోవడం తప్ప మరో దారి లేదు !’’ అంటూ లబో దిబో మన్నాడు.
    కృష్ణయ్య కాస్సేపు ఆలోచించి ఇలా తీర్పు చెప్పాడు :  ‘‘ఎలా చేసినా, ఎందుకు చేసినా, సోమయ్య దొంగ తనం చేసాడు కనుక అతనికి వంద కొరడా దెబ్బలు శిక్ష వేస్తున్నాను. ఇక,  సోమయ్య లేమి తనం తెలిసి కూడా అతని బలహీనతనకి పరీక్ష పెట్టినందుకు రామయ్యని కూడా శిక్షించక తప్పదు !నేరం చేయడం ఎంత తప్పో, నేరానికి ఏదో విధంగా ప్రేరే పించడమూ అంతే నేరం.
   అందు చేత, రామయ్యకి శిక్ష. అదేమిటంటే, అతడు సోమయ్యని తిరిగి పనిలో పెట్టు కోవాలి.అంతే కాదు , ఇక నుండీ అతనికి ఇచ్చే జీతాన్ని, కూడూ గుడ్డలను కూడా  రెట్టింపు చేయాలి.  ఇదే అతనికి సరైన శిక్ష ! ’’ అని తీర్పు చెప్పాడు.
  చుట్టూ ఉన్న జనం ఆ తీర్పు విని ‘‘ భలే ! చాలా బాగుంది ! ’’ అని
మెచ్చు కున్నారు !

2 కామెంట్‌లు:

kiran madhunapantula చెప్పారు...

manchi theerpu sir

కథా మంజరి చెప్పారు...

ధన్యవాదాలండీ.