13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

ఫలించిన ప్రయోగం





వెంకటాపురంలో సోమయ్య, కామయ్య అనే అన్నదమ్ములు ఉండే వారు. చిన్నవాడయిన కామయ్య మాయ మాటలు చెప్పి అందరినీ  మోసగిస్తూ వారి వద్ద గల ధనాన్ని అయినకాడికి దోచుకుంటూ ఉండే వాడు.అప్పుడప్పుడు ఇళ్ళలోజొరబడి దొంగతనాలు చేస్తూ విలాసవంతంగా జీవించడానికి అలవాటు పడ్డాడు. అన్నగారయిన సోమయ్య మాత్రం తనకి ఉన్న దానితో సంతృస్తి చెంది లాగో బతుకును నెట్టుకొస్తూ ఉండే వాడు. బతకడం చేత కాని వాడని అన్నగారిని కామయ్య తరచుగా ఆక్షేపిస్తూ ఉండే వాడు.సోమయ్య భార్య కూడా మరిది మాటలతో ఏకీభవించి భర్తనిసూటి పోటి మాటలతో వేధిస్తూ ఉండేది. దాంతో సోమయ్యకి ఇంట్లో మనశ్శాంతి కరువయింది.మానసికంగా క్రుంగి పోయేడు. తిన్నది హితవు కాక నీరసించి పోయేడు. దానితో ఎవరూ అతనిని పని లోకి పిలిచే వారు కాదు. సోమయ్య తన వేదనని ఒక రోజు గుడి పూజారి  వారికి చెప్పుకుని భోరుమని విలపించాడు.
   పూజారి చాలా సేపు ఆలోచించి అతనికి ఒక సలహా ఇచ్చాడు.  పూజారి ఇచ్చిన సలహా ప్రకారం ఒక రోజు సోమయ్య తమ్ముడిని పిలచి ఇలా అన్నాడు : ‘‘ తమ్ముడూ ! మన గుడి పూజారి వారు అత్యవసరంగా పొరుగూరు వెళ్ళ వలసి ఉందిట. ఈ ఒక్క రాత్రికి దేవుడి నగలను ఎలా భద్ర పరచాలా అని ఆందోళన చెందు తున్నారు.  సమయానికి ఆలయ ధర్మ కర్త వారు కూడా ఊళ్ళో లేరు. అందు చేత నగల పెట్టెను ఈ రాత్రికి నా యింట ఉంచమని కోరుతున్నారు. మా ఇంటి గురించి నీకు తెలుసు కదా. దాదాపు శిధిలావస్థలో ఉంది. భద్రత లేదు. అందు వలన దేవుడి నగల పెట్టెను ఈ రాత్రికి మీ ఇంట్లో భద్ర పరచి మనం ఇద్దరం వంతుల వారీగా మేలుకుని కాపాలా కాద్దాం. ఏమంటావు .’’ అనడిగాడు. ఆ మాటలతో కామయ్య ఎగిరి గంతేసినంత పని చేసాడు. వాడికి దేవుడి నగలు కాజేసే అవకాశం దొరికిందని మహదానంద పడి పోయాడు.  వెంటనే సరేనన్నాడు.
       ఆ రాత్రి కామయ్య ఇంట్లో అన్నదమ్ములిద్దరూ గుడి పూజారి ఇచ్చిన దేవుడి నగల పెట్టెకు వంతుల వారీగా మేలుకుని కాపాలా కాయసాగేరు. అర్ధ రాత్రి అయ్యేక, కాపాలా బాధ్యత తమ్ముడికి అప్పగించి అన్న గారయిన సోమయ్య నిద్రకు ఉపక్రమించి నిద్ర నటించాడు. అదే అదునుగా కామయ్య నగల పెట్టెను చంకన పెట్టుకుని ఇంటి నుండి ఉడాయించేడు. తెల్ల వారే వరకూ చాలా దూరం పరుగెత్తుకుంటూ పోయి, ఒక చోట ఆగి పెట్టె తెరచి చూసాడు.
ఇంముంది ! ఆ పెట్టెలో నగలు లేవు ! గులక రాళ్ళూ, రప్పలూ ఉన్నాయి.కోపంతో చిందు వేస్తూ ఇంటికి వచ్చేడు. వచ్చే ముందు ఎందుకయినా మంచిదని అన్నగారిని నమ్మించడం కోసం ఒంటి మీద బట్టలు చించుకుని, కొద్దిపాటి గాయాలు చేసుకున్నాడు. వస్తూనే ఏడుస్తూ అన్నగారితో ఇలా అన్నాడు: ‘‘ అన్నయ్యా ! నువ్వు నిద్ర పోయాక  నా ఇంట దొంగలు జొరబడ్డారు. నగల పెట్టె బలవంతంగా లాక్కుని నగలన్నీ కాజేసి ఖాళీ పెట్టె నా ముఖాన విసిరి కొట్టారు. అరవకుండా నా నోరు నొక్కేసారు. నన్ను ఊరవతల అడవి లోకి బరబరా లాక్కుని వెళ్ళి వదిలేసారు ’’ అంటూ నోటికొచ్చిన అబద్ధాలు కల్పించి చెప్పాడు.
      అంతకు ముందు నిద్ర నటిస్తున్న అన్న గారు తమ్ముడు నగల పెట్టె తీసుకుని పరారు కాగానే అతని ఇంట్లో ఊరి వాళ్ళ నుండి దోచుకున్న ధనాన్ని తమ్ముడి ఇంట్లో ఎక్కడెక్కడ దాచినదీ బయటకి తీసి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం గుడి పూజారి వారి ఇంటికి చేర్చాడు. తెల్లారేక ఎవరి సొమ్ము వారికి అందేలా పూజారి వారు ఏర్పాటు చేసి ఉంచేరు.
   తమ్ముడు దేవుడి నగలను దొంగలు ఎత్తు కెళ్ళారని క్ల బొల్లి మాటలు చెప్పగానే సోమయ్య ఇలా అన్నాడు: ‘‘ అవును తమ్ముడూ ! దొంగల్లో కొందరు నిన్ను లాక్కు పోయారా ? మరి కొందరు నీ ఇంట డబ్బూ దస్కం మొత్తం కాజేసారు చూడు !’’ అని. అన్న గారి మాటలు వింటూనే  కామయ్య తను డబ్బు దాచిన చోట్లన్నీ వెతికి ఖాళీగా ఉండడంతో లబోదిబో మన్నాడు.
సోమయ్య తమ్ముడిని ఓదారుస్తూ ‘‘ ఊరుకో తమ్ముడూ!  దేవుడి నగలతో పాటు. ఎంతో కష్ట పడి నువ్వు సంపాదించిన డబ్బు కూడా పోయింది.అంతా మన తలరాత !’’ అన్నాడు.
     అన్న గారి మాటలతో కామయ్య తేలు కుట్టిన దొంగలా నోరు మెదప లేక ఉండి పోయేడు !
దేవుడి నగలను దోచుకుందామనే తన దుర్బుద్ధి కారణంగానే పెట్టె లోని నగలు మాయమై పోయి గులక రాళ్ళు ఉన్నాయనీ, అంతే కాక ఊరి ప్రజలను దోచుకుని తను కూడ బెట్టినదంతా కూడా పోయిందనీ , యిదంతా దైవ మహిమ అనీ వాడికి అనిపించింది. భయంతో లెంపలు వాయించుకున్నాడు. ఆ నాటి నుండి వాడిలో పరివర్తన కలిగింది. మంచి వాడిగా మారి, ఊరిలో మంచి వాడిగా పేరు తెచ్చు కున్నాడు.
  తమ ప్రయోగం ఫలించినందుకు గుడి పూజారి, సోమయ్యలు ఆనందించేరు !

3, జనవరి 2015, శనివారం

హస్తవాసి



గురివిందాడ అగ్రహారంలో ఇద్దరు వైద్యులు ఉండే వారు. వారిలో ఒకరు భిషగ్రత్న భైరవ మూర్తి. మరొకరు వైభవ మూర్తి.  వారిలో భైరవ మూర్తి వైద్య శాస్త్ర గ్రంథాలను  క్షుణ్ణంగా ఔపోసన పట్టిన వాడు. వైద్యంలో ఆరితేరిన వాడు. ఆ అహంకారం అతనిలో ఎక్కువగా ఉండేది. తన దగ్గరకు వచ్చిన రోగులను చిన్న చూపు చూస్తూ వారితో దురుసుగా ప్రవర్తించే వాడు. మాటలతో భయ పెట్టే వాడు. వైభవ మూర్తి మాత్రం అరకొరగా వైద్యం నేర్చుకుని, తనకు తెలిసినంతలో వైద్యం చేసే వాడు. అసాధారణ మయిన రోగం వస్తే మాత్రం రోగ నిదానం ఎలా చేయాలో తెలియక సతమత మవుతూ ఉండేవాడు. అలాంటి స్థితిలో కూడా అతనిచ్చిన ఔషధాలు , అతని ఓదార్పు మాటలు చక్కగా పని చేసి రోగాలు తగ్గి పోతూ ఉండేవి. త్వరలోనే అతని హస్తవాసి మంచిదని పేరు వచ్చింది. అతని వద్దకు వచ్చే రోగుల సంఖ్య పెరగడమే కాక, అంతు లేని ధనం కూడా వచ్చి నడుతూ ఉండేది. నానాటికీ భైరవ మూర్తి దగ్గరకు వచ్చే రోగులే కరువయ్యారు. అతని ఆర్ధిక సరిస్థితి కూడా క్షీణించి పోసాగింది.  దానితో అతనిలో అసహనం మరింత పెచ్చు పెరిగి పోయేది. అయిన దాదనికీ కాని దానికీ రోగుల మీద విరుచుకు పడి పోతూ ఉండే వాడు. దానితో వచ్చే వారి ఆ పాటి రోగులు సైతం రావడం తగ్గించి వేసారు ! వైభవ మూర్తికి వైద్యంలో ఏమంత పట్టు లేక పోయినా అతని దగ్గరకు అంత మంది రోగులు ఎందుకు వెళ్తున్నారో అర్ధం కాక భైరవ మూర్తి  జుట్టు పీక్కునే వాడు.
     ఇలా ఉండగా, వైభవ మూర్తికి అంతు పట్టని  వింత రోగమేదో  దాపురించింది. సొంత వైద్యం పనికి రాక పోగా వికటించింది. ఇక లాభం లేదనుకుని చేసేది లేక అతను భైరవ మూర్తి దగ్గరకు వచ్చి, తనను రోగం నుండి కాపాడ మని అతని కాళ్ళు పట్టు కున్నాడు. భైరవ మూర్తి అతనికి వైద్యం చేసి త్వరలోనే అతని రోగం కుదిర్చాడు.  అయితే , అందుకు ప్రతిఫలంగా ఊరు విడిచి ఎక్కడి కయినా పొమ్మని ఆదేశించాడు.
  అందుకు వైభవ మూర్తి నవ్వి, ‘‘ మిత్రమా ! నేను ఊరు విడిచి వెళ్ళి పోతే నాలాంటి వాడు మరొకడు ఈ ఊరికి రాకుండా పోడు.  నా వల్ల నీకు యిబ్బంది కలిగిన మాట వాస్తవం. నిజం చెప్పాలంటే, వైద్యంలో నీకున్న ప్రతిభా పాటవాల ముందు నేను గడ్డి పరకను. కానీ నా హస్తవాసిమంచిదనీ, నాకు వైద్యం బా తెలుసుననీ రోగులు అధిక సంఖ్యలో నా వద్దకు వస్తున్నారు. దానితో వైద్యం శాస్త్రం లో విశేష ప్రతిభ గల నీ వద్దకు వచ్చే రోగులే కరువయ్యారు. అసహనం, అహంకారం అనే అంతశ్శత్రువులే నీ అభివృద్ధికి ఆటంకాలు. ఊరి నుండి నన్ను కాదు, ముందు నీ మనసులోనుండి వాటిని తరిమెయ్ !వైద్యుడిచ్చే ఔషధాలతో పాటు రోగులకు వైద్యుని పట్ల విశ్వాసం ఉండాలి. వైద్యుని ప్రేమ పూర్వక వచనాలు వారి రోగాన్ని సగం పోగొడతాయి. నిజానికి నువ్వు ఏ రోగాలకు ఏ మందులు ఇస్తున్నావో నా చెవిని వేయడానికి నా సొంత మనుషులను నీ వద్దనీకు తెలియకుండా ఉంచేను. అవే మందులను నేను నా రోగులకు ఇచ్చే వాడిని దానికి తోడు వారితో చాలా మంచిగా ఉండే వాడిని ఇదే నా విజయ రహస్యం !నాకు వైద్యం చేసి తిరిగి కోలుకునేలా చేసావు కనుక ఆ కృతఙ్ఞతతో నీకీ విషయం చెబుతున్నాను. విద్యతో పాటు లోక తంత్రం తెలియని వాడెవ్వడూ లోకంలో రాణించ లేడు సుమా ! ఇక నుండి నీ పద్ధతి మార్చుకో ! నీకు ఎదురుండదు ... నీ నీడన చిన్న చిన్న రోగాలకు వైద్యం చేస్తూ నేనూ నా జీవనం గడుపుతాను.’’ అని అన్నాడు.
         వైభవ మూర్తి మాటలతో భైరవ మూర్తిలో అనూహ్య మైన మార్పు వచ్చింది. ఆ నాటి నుండి అతని దగ్గరకి వచ్చే రోగుల సంఖ్య ఇబ్బడి ముబ్బిడిగా పెరిగి పోయింది. ఆ ప్రాంతాలలో  హస్తవాసి ఉన్న వైద్యునిగా అతనికి గొప్ప పేరు వచ్చింది. అతని సహాయకునిగా చేరి వైభవ మూర్తి కూడా అతని నుండి వైద్య శాస్త్రంలోని మెళకువలు చాలా నేర్చు కున్నాడు.
   ఒకరి కొకరు తోడుగా వైద్య సేవలు అందిస్తూ ఉండడంతో ఆఊరి ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది.
ఇప్పుడా ఊరికి సుదూర ప్రాంతాల నుండి కూడా మంచి వైద్యం కోసం వస్తున్నారు తెలుసా !