కాకులు
దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. ఓ రోజు అడివంతా మారు మ్రోగి పోయేట్టుగా ఏనుగు
ఘీంకరించింది. అంటే, అడవి జంతువు లన్నీ వెంటనే సమావేశం కావాలని పిలుపు అన్నమాట!
మరు క్షణంలోనే అడవి లోని జంతువు లన్నీ బిలబిలా అక్కడికి చేరాయి.
మృగరాజు సింహం, ఆ ప్రక్కనే పులి. దగ్గర లోనే ఎలుగు బంటి , ఏనుగు ఎనుము, జింక,
కుందేలు, నక్క ... యిలా అన్నీ వచ్చి, తమకు తగిన చోటున నిలబడ్డాయి. పక్షులు చెట్ల
మీద గుమి గూడితే, కోతులు కొమ్మల మీద వేలాడుతూ చేరాయి.
అప్పుడు పులి ఇలా అంది : ‘‘సోదరులారా ! మనం ఈ అడవిలో చాలా ళ్ళుగా ఉంటున్నాం. మన తాత
తండ్రులు ఇక్కడే బతికేరు. ఈ అడవి పేరు సత్య వనం ! ఆ పేరు ఎందుకు వచ్చిదంటే, ఇక్కడ
ఉండే చెట్లూ, చేమలూ, పక్షులూ, జంతువులూ అన్నీ ఏ నాడూ నీతి తప్ప లేదు. అలాంటి మన సత్య వనానికి కొంత కాలం క్రిందట ఒక
దొంగల గుంపు వచ్చింది.ఈ విషయం మీ అందరికీ తెలిసిందే ! వాళ్ళు ఒక పెట్టెను ఇక్కడే ఈ మామిడి చెట్టు
మొదట్లో గొయ్యి తీసి దాచి ఉంచేరు. అలా చేసాక, దొంగల నాయకుడు గొంతెత్తి బిగ్గరగా ఇలా
అన్నాడు : ‘‘ఓ అడవి జంతువు లారా ! చెట్టుల్లారా!
పిట్టల్లారా ! ఇది మేం దొంగతనం చేసి తెచ్చిన పాపపు సొమ్ము. దీనిని ఇక్కడ
దాస్తున్నాం.త్వరలోనే వచ్చి, తీసుకుని పోతాం. అంత వరకూ దీనిని మీరు కాపాడాలి.
దీనిని ఎవరయినా తీసినా, లేదా తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నా, మా పాపంలో భాగం మీకూ
వస్తుంది !
అందు వలన మేం వచ్చే వరకూ దీనిని భద్రంగా కాపాడండి ’’ అని చెప్పి, తన దొంగల గుంపుతో వెళ్ళి పోయేడు.
దొంగల గుంపు వెళ్ళి పోయి చాలా
ఏళ్ళవుతోంది. మరింక తిరిగి రాలేదు. వస్తారనే నమ్మకమూ లేదు. మన సత్య వనంలో ఈ
పెట్టెను కాపాడ వలసిన బాధ్యత మన అందరి మీదా ఉంది. ప్రధానంగా ఆ బాధ్యతను మనం ఈ
మామిడి చెట్టుకి అప్పగించాం. మీకు తెలుసు కదా ! ఇప్పుడు ఈ మామిడి చెట్టు మరింక
ఎక్కువ కాలం ఈ పెట్టెను తాను కాపాడ లేనని చెబుతోంది. మనుషులు మనకి శత్రువులు. ఈ
పెట్టెను ఉంచింది దొంగలు. అయితే నేం, దీనినిక్కడ దాచి, ఆ బాధ్యత మనకి ఒప్పగించారు
కనుక మనం ఇంత కాలం దీనిని కాపాడుతూ వచ్చేం. మన అడవికి సత్య వనం అనే పేరు నిలుపు
కుంటూ వచ్చేం.ఆ పేరు పోగొట్టు కోవడం మంచిది కాదు. .అయితే, ఇవాళ దూర ప్రాంతాలు చుట్టి వచ్చిన రామ చిలుక ఒక
వార్తను మోసు కొచ్చింది. అదేమిటంటే, ఇక ఆ దొంగల గుంపు మరింక తిరిగి ఇక్కడకి వచ్చే
అవకాశమే లేదు ! వాళ్ళంతా రాజభటుల చేతికి చిక్కి మరణ శిక్షకు గురయ్యారుట అని .
మరింక ఇప్పుడేం చేయాలనే ఆలోచన అడవి జంతువులకి వచ్చింది.అందుకే మళ్ళీ
సమావేశ మయ్యాయి. ముందు ఆ పెట్టెను భూమి లోనుండి వెలికి తీయాలనుకున్నాయి.
ఎలుగుబంటికి ఆ పని అప్ప చెప్పాయి. ఎలుగు గొయ్యి తవ్వింది. చిత్రంగా ఆ గొయ్యిలో
దొంగలు దాచిన పెట్టె లేదు !
దొంగలంతా రాజ భటుల చేతికి
చిక్కి నప్పుడు తప్పించు కొన్న ఒక దొంగ తన వాళ్ళందరూ ఉరిశిక్ష పడి మరణించాక, తాను
ఒక్కడూ ఒక రాత్రి వేళ వచ్చి, దానిని త్రవ్వి తీసుకు పోయాడు ! ఈ విషయం ఎవరికీ
తెలియదు.
అడవి జంతువు లన్నింటికీ మామిడి చెట్టు మీద చెప్ప లేనంత కోపం వచ్చింది. ఈ
చెట్టే దానిని కాజేసింది . మన సత్య వనానికి ఎన్నడూ రానంత చెడ్డ పేరు వచ్చింది.
దీనికి శిక్ష పడాలి. దీనితో పాటు అడవిలో ఉన్న చెట్లన్నింటినీ కూల్చి పారెయ్యాలి !
అలా చేస్తే కానీ ఈ వృక్ష జాతికి బుద్ధి రాదు ! అనుకున్నాయి ఆగ్రహంగా. అందుకు సిద్ధపడ్డాయి. వాటి నిర్ణయంతో అడవిలోని
చెట్లూ, పొదలూ, లతలూ వజవజలాడి పోయేయి. వాటి మీద కాపురాలుండే పక్షులు
లబోదిబోమన్నాయి.కొమ్మలూ, రెమ్మలూ, ఆకులూ, పూల రెక్కలూ ఊపుతూ చెట్లు కన్నీరు
కార్చాయి.
ఒక ముసలి కోతికి మాత్రం అడవి
జంతువుల తొందరపాటు నచ్చ లేదు. అది ఉపాయంగా వాటితో ఇలా అంది : ‘‘తొందరపాటు వద్దు. మన సత్య వనంలో
ఎప్పుడూ ఎలాంటి అక్రమమూ జరుగదు. నగల పెట్టె కర్రది కనుక చాలా కాలం భూమిలో ఉండి
పోవడం చేత శిధిల మైపోయి భూమిలోకలిసిపోయి ఉంటుంది. వానలకీ వరదలకీ అందులోని నగలన్నీ
ఎక్కడికో కొట్టుకుని పోయి ఉంటాయి. అంతే తప్ప ఈ మామిడి చెట్టు దానిని కాజేసి ఉండదు.
తాతల కాలం నుడీ ఈ మామిడి చెట్టు ఎంత మంచిదో మన అందరికీ తెలుసు. నిష్కారణంగా
ఇప్పుడు దీని మీద నిందారోపణ చేసి, దీనితో పాటు మొత్తం అడవి లోని చెట్ల నన్నింటినీ
నాశనం చెయ్యాలను కోడం తగదు. మనం తెలివి తక్కువగా ప్రవర్తిస్తే, మన పచ్చని అడివంతా
ధ్వంసమై పోతుంది. అది ఎవరికీ మంచిది కాదు !
విలువైన నగల పెట్టె ఇక్కడే
మట్టిలో కలసి పోవడం చేత దీని భూసారం మరింత ఎక్కువయింది. అందుకే ఈ చెట్టు మునుపటి
కన్నా ఎంతో రుచికరమయిన పళ్ళను ఇస్తోంది. గమనించ లేదూ !’’ దాని మాటలో అడవి జంతువు
లన్నీ పునరాలోచనలో పడి, తమ నిర్ణయాన్ని మార్చు కున్నాయి.
అడవిలో వృక్ష జాతి హమ్మయ్య ! అని ఊపిరి అని ఊపిరి పీల్చుకుంది !
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి