28, సెప్టెంబర్ 2014, ఆదివారం

మెరిసే రంగు రాళ్ళు !


అనగా అనగా ఒక అడవిలో ఒక ఎలుగు బంటి ఒక రోజు ఆహారం కోసం వెతుకుతూ బయలు దేరింది. కొంత దూరం వెళ్ళాక, దానికొక పెద్ద పుట్ట కనిపించింది. పుట్ట తవ్వడం మొదలెట్టింది. అందులో దానికి మెరిసే రంగు రాళ్ళు లెక్క లేనన్ని కనిపించాయి. వాటిని చూసి, నిప్పు కణికె లేమో నని భయపడి దూరంగా పారి పోయింది. కాస్సేపటికి ధైర్యం కూడదీసుకుని దగ్గరగా వెళ్ళి వాటిని పరీక్షగా చూసింది. అవి మెరిసే రంగు రాళ్ళే తప్ప ,నిప్పు కణికెలు కావని  నిర్ధారణ కొచ్చింది. వాటన్నింటినీ ఒక ఆకు దొప్ప లోకి  ఏరి,  తనుండే గుహ దగ్గరకి వచ్చింది.  ఆ మెరిసే రంగు రాళ్ళతో ఆడుకో మని తన పిల్లలకి ఇచ్చింది. వాటితో  ఎలుగుబంటి పిల్లలు రోజూ సరదాగాఆడుకోసాగాయి.
      ఇలా ఉండగా, ఒక రోజు ఒక టక్కరి నక్క ఆ ఎలుగు బంటి పిల్లలు ఏవో మెరిసే రంగు రాళ్ళతో ఆడు కోవడం గమనించింది. ఎలాగయినా వాటిని తన స్వంతం చేసు కోవాలని దానికి దుర్బుద్ధి పుట్టింది. అది ఒక రోజు తల్లి ఎలుగుబంటి లేని సమయం చూసి ఆ పిల్లల దగ్గరకి వచ్చింది.  వచ్చి ఇలా అంది :  ‘‘మీకు తినడానికి నా దగ్గర చాలా రుచికరమైన ఆహారం ఉంది ! మీకు కావలసినంత ఇస్తాను. ఇంకా ఎంత కాలం ఆ మెరిసే రంగు రాళ్ళతో ఆడుకుంటారు ? విసుగు వెయ్యడం లేదూ ! వాటిని నాకిచ్చెయ్యండి ! ’’ అంది.
    ఎలుగు బంటి పిల్లలు కాస్సేపు ఆలోచించి, దానితో ఇలా అన్నాయి :
 ‘‘ నువ్వన్నది నిజమేలే ! వీటితో రోజూ మేము ఆడుకుంటూనే ఉన్నాం. మాకు మంచి రుచికరమైన తిండి తినాలని ఉంది ! అందు చేత ఈ ఒక్క రోజు మేము వీటితో ఆడుకుని, రేపు నీకు వీటిని ఇచ్చేస్తాం. రేపు ఇదే వేళకి ఇక్కడకి రా ! నువ్వు వచ్చేటప్పుడు మాకోసం రుచికరమైన ఆహారం తీసుకు రావడం మాత్రం మరచి పోవద్దు సుమా ! ’’ అన్నాయి.
     ఆ రాత్రి తల్లితో అవి ,నక్క  వచ్చి తమను మెరిసే రంగు రాళ్ళని తనకి ఇచ్చెయ్యమని అడిగినట్టుగా చెప్పాయి.  వాటికి బదులు తమకి  నక్క మంచి ఆహారం ఇస్తానన్నదని కూడా చెప్పాయి.
     తల్లి ఎలుగుబంటి అంతకు ముందే గజరాజు వలన ఆమెరిసే రంగు రాళ్ళు చాలా విలువైనవని తెలుసుకుంది. దానికి  నక్క దురాలోచన అర్ధమయింది. టక్కరి నక్కకి ఎలాగయినా తగిన గుణపాఠం చెప్పాలనుకుంది. మర్నాడు నక్క వస్తే ఏం చెయ్యాలో వివరంగా పిల్లలకి చెప్పింది.
    మర్నాడు తల్లి ఎలుగు లేని సమయం చూసి  నక్క  ఎలుగు బంటి పిల్లల దగ్గరకి వచ్చింది. వాటితో ‘‘ పిల్లల్లారా ! మీరు నాకు ఆ మెరిసే రంగు రాళ్ళు ఇవ్వండి ...వాటిని తీసుకెళ్ళి నా ఇంటిలో దాచి, మీకు ఎంతో రుచికరమైన తిండి తెస్తాను ! ఇలా వెళ్ళి అలా క్షణంలో వచ్చెయ్యనూ ! ’’ అంది.
     ఎలుగు బంటి పిల్లలు తమకి ముందు రోజు తల్లి చెప్పినట్టగా  నక్కతో ఇలా అన్నాయి : ‘‘ సరేలే ! అదిగో ! ఆ చెట్టు తొర్రలో మా మెరిసే రంగురాళ్ళు ఉన్నాయి, వెళ్ళి తీసుకో ! కానీ మాకు మాత్రం వెంటనే మంచి రుచికరమైన తిండి తెచ్చి ఇవ్వాలి సుమా ! ’’ అని.
    అలాగే నంటూ  నక్క తన  ఉపాయం ఫలించినందుకు సంబర పడి పోతూ గబగబా చెట్టు తొర్ర దగ్గరకి వెళ్ళింది. ముందూ వెనుకా చూసు కోకుండా దానిలో సంతోషంగా చెయ్యి పెట్టింది.
   ఎలుగు బంటికి నిప్పు అంటే భయం కదా ! అంచేత, కోతి బావ సాయం తీసుకుని  అంతకు ముందే తల్లి ఎలుగు బంటి  అక్కడ రంగు రాళ్ళకి బదులు నిప్పు కణికెలు ఉంచింది !  ఆ విషయం తెలియక చెట్టు తొర్రలో చెయ్యి పెట్టింది నక్క.
 నిప్పు కణికెలను తాకడంతో దాని చేతులు కాలేయి ! చేతులే కాక మూతి కూడా కాలింది !
     దానితో ఆ టక్కరి నక్క అక్కడి నుండి లబోదిబోమని ఏడుస్తూ పారి పోయింది !
       మరెప్పుడూ అది ఎలుగు బంటిపిల్లల జోలికి, రానే లేదు !

కామెంట్‌లు లేవు: