కోమల పురం
రాజు గారికి ఒక్కగా నొక్క సంతానం. లేక లేక కలిగిన ఆడు బిడ్డకి అపరంజి అని పేరు
పెట్టుని రాజ దంపతులు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉండే వారు. దానితో ఆ
పిల్లకి గారాబం ఎక్కువయి చాలా తల బిరుసుగా తయారయింది. ఆమె అపురూప లావణ్యవతి.
అనునిత్యం అద్దంలో తన ప్రతి బింబం చూసుకుంటూ మురిసి పోతూ ఉండేది. పొద్దస్తమానం
అద్దం ముందు నుండి కదిలేది కాదు. అద్దం తోడిదే లోకంగా ఉండేది. రోజంతా అద్దం ముందు
నిలబడి ఒయ్యారాలు పోతూ ఉండేది. ఆమె నయగారాలు చూసి తల్లి దండ్రులు తెగ ముచ్చట
పడిపోతూ ఉండే వారు. రాజు ఆమె కోసం
ఎక్కడెక్కడి నుండో మంచి మంచి అద్దాలను తెప్పించి కుమార్తెకు ఇచ్చే వాడు. అవి
రకరకాల కొలతలతో, లతలు మొదలయిన రకరకాల అంకారాలతో, మంచి నగిషీలతో ఒప్పుతూ ఉండేవి.
అసరంజికి వాటిలో చాలా మట్టుకు నచ్చేవి కావు. నిర్లక్ష్యంగా చూసి ప్రక్కన పడేస్తూ
ఉండేది.
తన అందాన్ని ద్విగుణీకృతం చేయగల అద్దం
కావాలని ఆమె కోరిక.అలాంటి అద్దం దొరకడం అసాధ్యం అని ఎవరెంత చెప్పినా ఆమె వినిపించు
కునేది కాదు. తన పట్టుదలా. పంతమూ తనదే. కోమలపురం ప్రభువు రకరకాల అద్దాలను ఎంత
ఖరీదయినా వెనుతీయకుండా కొనుగోలు చే స్తున్నాడని
తెలిసి,ఎక్కడెక్కడి నుండో వర్తకులు రకరకాల అద్దాలను తెచ్చి , రాజు గారికి
విక్రయిస్తూ ఉండే వారు.
ఇలా ఉండగా ఒక రోజు నేపాళ దేశం నుండి ఒక వర్తకుడు వచ్చి,అద్బుతమైన
పనితనంతో అలరారుతూ ఉన్న ఒక చక్కని
నిలువెత్తు అద్దం ఒకటి అమ్మకానికి తెచ్చాడు. అపరంజి ఆ అద్దాన్ని చూసి
వర్తకునితో ‘‘ఇది నా అందాన్ని రెట్టింపు చేసి
చూపెడుతుందా ? ’’ అని అడిగింది. అందు కతడు వినయంగా
చేతులు జోడించి, ‘‘ అలాంటి అద్దం ఇంత వరకూ ఎవరూ తయారు చేయ లేక పోయేరు యువ
రాణీ ! అయితే ఇప్పటికి మాత్రం వ్యక్తుల ప్రతి బింబాన్ని ఉన్నదున్నట్టుగా
చూపెట్టడంతో పాటూ, వారి నిజ స్వరూపాన్నీ
అంతరంగాన్నీ చూపెట్టగల అద్దం మాత్రం తయారయింది. అదొక మాయా దర్పణం ! అదే, ఇది ! ’’అన్నాడు. అపరంజి కుతూహలంతో తండ్రి చేత దానిని చాలా ధనం
పోసి కొనిపించింది.
వర్తకుడు వెళ్ళి పోయేక
అపరంజి ఆ అద్దాన్ని తన గదిలో పెట్టు కుని అందులో తన ప్రతి బింబం చూసుకుంది. ఇంకే ముంది ! అద్దంలో ఆమెకు తన
ప్రతి బింబం చాలా వకృతంగా కనిపించింది ! దానితో ఆమె ఉగ్రురాలై వర్తకుని కోసం
భటులను పంపించి వెతికించి బంధింప చేసి కారాగారంలో పడ వేయించింది.
ఆ తరువాత తన గది లోకి వెళ్ళి
మరో మారు అద్దంలో తన రూపం చూసుకుంది. ఆ సారి ఆమెకు తన రూపం అద్దంలో జంతు రూపంలో
కనబడింది. ఆమెకి పట్టరానంత ఆగ్రహం కలిగింది. వెంటనే కారాగారంలో ఉన్న వర్తకుని ఉరి తీయించమని తండ్రి
గారితో చెప్పింది.
వర్తకుడిని ఉరి తీసే ఘడియలు సమీపిస్తూ
ఉండగా, కుతూహలం పట్ట లేక అపరంజి అద్దంలో మరో మారు తన రూపం చూసుకుంది. ఆశ్చర్యం ! ఈ
సారి ఆమెకు అద్దంలో తానొక రాక్షసి రూపంలో కనిపించింది. దానితో ఆమె విపరీతంగా భయ
పడి పోయింది. ఏడుస్తూ తండ్రి దగ్గరకి వెళ్ళి జరిగినదంతా తండ్రికి వివరించి చెప్పింది.
రాజు వర్తకునికి వేసిన ఉరి శిక్షను తాత్కాలికంగా వాయిదా వేసి, రాజ పురోహితుని రప్పించి, అపరంజికి కలిగిన
అనుభవాలను గురించి చెప్పి, కారణ మేమిటని అడిగాడు.
రాజ పురోహితుడు దీర్ఘంగా
ఆలోచించి ఇలా అన్నాడు ‘‘ ప్రభూ ! అహితం చెబుతున్నందుకు తమరు
అన్యథా భావించ వద్దు. మన్నిస్తే నాకు తోచిన కారణం విశదం చేస్తాను. అవధరించండి. యువ రాణి వారు తొలిసారిగా మాయా దర్పణంలో చూసు
కున్నప్పుడు, లోకాతీత మయిన అంద గత్తెననే అహంకారం వల్ల ఆమెకు తన రూపం వికారంగా
కనబడింది. వర్తకుని అకారణంగా చెరసాలలో బంధించి నందుకు రెండో సారి జంతు రూపంలో తను కనబడింది. మూడవసారి ఏకంగా వర్తకుని నిర్దయగా ఉరి తీయించ
మన్నందుకు ఆమెకు తానొక రాక్షస
స్త్రీ గా కనిపించింది. యువ రాణి
వారిలో మార్ప వస్తే తిరిగి ఆమెకు తన ప్రతి బింబం మామూలుగా కనబడే అవకాశం ఉందని
అనిపిస్తోంది’’ అని వివరించాడు.
వెంటనే అపరంజి అతని మాటలలో నిజానిజాలు తెలుసుకోగోరి
వర్తకుని ఉరిశిక్షను రద్దు చేయించింది. ఈ సారి ఆమెకు అద్దంలో జంతు రూపంలో తాను
కనిపించింది. వర్తకునికి విధించిన కారాగార శిక్షను రద్దు చేయించాక అద్దంలో
చూసుకుంటే, ఆమెకు మానవ రూపంలోనే
కనిపించింది. అయినా కొంత
అనాకారితనంతో కనిపించింది. అపరంజి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో గర్వాన్ని
విడిచి పెట్టి, ఆ వర్తకునికి విలువయిన కానుకలను ఎన్నింటినో ఇచ్చి గౌరవించి
పంపింది.
వర్తకుడు మహదానంతో వెళ్ళి పోయేక, అపరంజి కొంత
బెరుకుగానే తన రూపం అద్దంలో చూసుకుంది.
ఈ సారి అద్దంలో తన రూపం ఆమెకు అందంగా
కనబడింది. !
అంతే కాదు, మునుపటి కన్నా రెట్టింపు అందంగా
కనబడింది !!
2 కామెంట్లు:
బాగుంది.
Chaala bagundi Saar
Thank you
కామెంట్ను పోస్ట్ చేయండి