11, సెప్టెంబర్ 2014, గురువారం

కుందేలు త్యాగం !


ఒక మండు వేసవి కాలంలో అడవి జంతువులన్నీ ఎక్కడా త్రాగడానికి చుక్క నీరు లేక, విలవిలలాడి పోయాయి.గుక్కెడు నీళ్ళ కోసం అవి , అడివంతా జల్లెడ వేసి గాలించాయి.ఎక్కడా చుక్క నీళ్ళు కనిపించ లేదు ! అడవి జంతువులలో కాస్త వయసు పైబడ్డ  పెద్ద జంతువులు బాధగా ఇలా అన్నాయి : ‘‘పుట్టి బుద్ధెరిగి,ఇంతటి దారుణమైన వేసవి కాలాన్ని ఎప్పుడూ చూడ లేదు! ’’ అని.
     జంతువులన్నీ నీళ్ళ కోసం వెతుకుతూ అడవి సరిహద్దులు విడిచి, చివరకి గ్రామాల మీద పడ్డాయి. గ్రామ ప్రజల చేతిలో చావుని కొని తెచ్చు టున్నాయి.రోజు రోజుకీ నీళ్ళ కోసం ఊళ్ళ మీద పడిన జంతువులు ఒక్కొక్క టీ జనాల చేతికి చిక్కి మరణిస్తున్నాయి. అడవి జంతువులకి ఏం చేయాలో తోచ లేదు.
     ఒక రోజు జంతువులన్నీ అడవిలో ఒక చోట  సమావేశ మయ్యాయి. తమలో తాము ఇలా చర్చించు కున్నాయి :
      ‘‘ మనందరికీ చావు మూడినట్టుగా ఉంది.నీరు లేక పోతే బ్రతకలేం కదా !
నీటి కోసం గ్రామాల మీద పడిన వాళ్ళలో ,మనవాళ్ళు ఇప్పటికే చావు కొని తెచ్చు కున్నారు. ఇక ఇక్కడ ఉండ లేం  బాబూ !   అలా అని, అడవిని విడిచి ఎక్కడికీ వెళ్ళ లేం !  ఏం చేయాలో తోచడం లేదు !’’ అంది పులి విచారంగా.
    తక్కిన జంతువులన్నీ అవునంటే అవునని పెద్ద పెట్టున ఏడవడం మొదలు పెట్టాయి.
    ‘‘ మన పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది కనుక, ఇక మనం అందరం కలసి ఒకే సారి ఆత్మ హత్యలు చేసు కోవడం మంచిదని నాకు అనిపిస్తోంది ..’’ అంది ఏనుగు.
    ఒక్క కుందేలు తప్ప,  తతిమ్మా జంతువులన్నీ అలా చేయడం తప్ప మరో దారి లేదంటూ అంగీకరించాయి. ఏక కంఠంతో హాహాకారాలు చేసాయి. వాటి ఏడుపులతో అడవి దద్దరిల్లి పోయింది !
      ఇంతలో కుందేలు తల పైకెత్తి ,  ఆకాశం వంక చూసింది.
       ఆకాశం లోకి చూస్తూ అంది : ‘‘ ఆగండాగండి ! మీ ఏడుపులు ఆపండి !
అదిగో !ఆకాశంలోమబ్బు తునక కనబడుతోంది !ఎప్పుడు కురుస్తుందో
 అడుగుదాం ..’’  అని అరిచింది.
       అడవి జంతవులన్నీ దుఃఖం దిగమ్రింగుకుని, తలలు పైకెత్తి ఆకాశం లోకి చూసాయి. అక్కడో చిన్న మబ్బు తునక వాటికి కనిపించింది.
   ‘‘ మబ్బు తునకా ! మబ్బుతునకా !  మా అడవిలో ఎప్పుడు కురుస్తావో
చెప్పవూ ?!’’ దీనంగా అడిగింది జింక.
‘‘ అయ్యో ! కురిసేటంత శక్తి నాకు లేదు ! నేను వొట్టి తెల్ల మబ్బును.నాతో నీటిని తెచ్చు కోలేదు.మరి, నేనెలా కురవ గలనూ ? నేను వెళ్ళి, మా కర్రి మబ్బు అన్నతో మీరు పడుతున్న కష్టాల గురించి చెబుతాను. అతను వచ్చి, మీకు కావలసినంత నీటిని కురిపిస్తాడు లెండి !’’ అంది మబ్బు తునక. అని భరోసా ఇచ్చి , అక్కడి నుండి కదలి పోయింది.
    మబ్బు తునక వెళ్ళి చాలా రోజులయినా, కర్రి మబ్బు వచ్చే జాడ కనిపించ లేదు. అడవి జంతువులన్నీ ఆందోళన పడసాగేయి. ఆశ వదులు కున్నాయి.
‘‘ ఇక మన చావు ఖాయం. మబ్బు తునక మనల్ని మోసం చేసింది. చచ్చే వాళ్ళని చావనివ్వకుండా , మనం మరిన్ని రోజులు బతికేలా చేసింది. కష్టాలు అనుభవించేలా చేసింది. మనకింక వాన కోసం ఎదురు చూసే ఓపిక లేదు !
ఈ మబ్బులని నమ్మ లేం !  ఇక మనకు సామూహిక ఆత్మ హత్యలే గతి !’’ అనుకున్నాయి. ఆత్మ మత్యలు చేసు కోడానికి సిద్ధ సడ్డాయి.
   కుందేలు వారించింది : ‘‘సరే, నాకు ఆఖరి అవకాశం ఇవ్వండి ...నేను దూర ప్రాంతాలకు వెళ్ళి, కర్రి మబ్బు వస్తోందేమో చూసి వస్తాను ... అయితే, నేను తిరిగి వచ్చే వరకూ మీరు ఎలాంటి అఘాయిత్యాలకూ పాల్పడమని నాకు మాట ఇవ్వండి.’’ అంది. ఎలాగో అతి కష్టం మీద వాటిని  ఆత్మ హత్యలు చేసుకో కుండా కుండా ఆపగలిగింది.
   అడవి జంతువులన్నీ వంతుల వారీగా నీటి కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటూ దగ్గర లోని గ్రామాలకు వెళ్ళి రాసాగేయి.
    కుందేలు వెళ్ళి చాలా రోజులు గడిచాయి. అడవి జంతువుల కష్టాలు నానాటికీ ఎక్కవయింది. ఒక ప్రక్క నీటికి కటకట. బతకడం దుర్భరమైపోతోంది. చద్దామంటే, తను తిరిగొచ్చే వరకూ ఆత్మ హత్యలు చేసుకో వద్దని కుందేలు తమ వద్ద మాట తీసుకుందాయె !  ఏం చేలాలో వాటికి తోచ లేదు.
   అలాగే ప్రాణాలు ఉగ్గ బెట్టుకుని రోజులు వెళ్ళ దీసాయి.
    కుందేలు రాక కోసం కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూడసాగేయి.
     అది వస్తుందన్న ఆశ నానాటికీ సడలి పోతోంది.
      కానీ , అదొచ్చే వరకూ ఎదురు చూడడం తప్ప మరో మార్గం లేదు !
       ఇలా ఉండగా,  వానా కాలం రానే వచ్చింది.
        ఎక్కడి నుండో  కర్రి మబ్బులు కమ్ముకుని వచ్చి, చాలా రోజుల తరువాత అడవిలో విస్తారంగా వానలు కురిపించాయి !  అడవి జంతువుల ఆనందం అంతా ఇంతా కాదు ! తమ ఆపద అలా గట్టెక్కాక, అవి హమ్మయ్య అనుకుని, ఇక కుందేలు రాక కోసం ఆత్రంగా ఎదురు చూడ సాగేయి.
      చిన్ని కుందేలు మాత్రం అక్కడికి మరింక తిరిగి రాలేదు !
      ఏమై పోయిందో ఎవరికీ తెలియదు.
       వేసవి గడచి, మళ్ళీ వర్షా కాలం వచ్చే వరకూ, ఆశ కల్పించి, తమని బ్రతికిండం కోసమే  అది తన ప్రియమైన అడవిని వదిలి ఎక్కడికో వెళ్ళి పోయిందని వాటికి తెలియదు !!!                     

1 కామెంట్‌:

కథా మంజరి చెప్పారు...

శ్రీమతి మథునా పంతుల ఇందిర ఫేస్ బుక్ లో ఈ కథ గురించి ఇలా రాశారు :

చిన్న కథేనా చాలా బాగుంది.కుందేలు త్యాగము భాదగా అని పించింది