25, డిసెంబర్ 2014, గురువారం

రాజ కుమారి పెళ్ళి !



అవంతీ రాజ్యాన్ని పాలించే రాజు అసమర్ధుడు కావడంతో రాచ వ్యవహారాలన్నీ అతని చిన్న రాణి కుముదినీ దేవి నిర్వహించేది. పట్టపు రాణి ఏదో వింత వ్యాధి దాపురించి, అకాల మరణం చెందింది. దానితో ఆమె ఒక్కగా నొక్క కూతురు వినోదిని తల్లి లేని పిల్లయి పోయింది. చిన్న రాణి ఆమెను నానా బాధలూ పెట్టేది. చిన్న రాణి పెట్టే బాధలు భరించ క వినోదిని  నిత్యం ఏడుస్తూ  కాలం గడిపేది. రాజు చిన్న రాణిని వారించ లేక సతమత మయ్యే వాడు. చిన్న రాణి పెట్టే  బాధలు  భరించ లేక వినోదిని  ఒక రోజు అడవి లోకి పారి పోయింది.
   చాలా సేపు అడవిలో ఎక్క డెక్కడో తిరిగి, నీరసంతో ఓపిక నశించి, చీకటి పడే వేళకి అక్కడ వో పెద్ద పాడు పడిన భవనం కనిపిస్తే అందు లోకి వెళ్ళింది. అక్కడ వొక పాత కాలపు పెద్ద పందిరి మంచం కనిపిస్తే, దాని మీద వాలి పోయి,ఒళ్ళెరక్కుండా నిద్ర పోయింది.
    ఆ పాడు పడిన భవనంలో చాలా ఏళ్ళుగా ఒక బ్రహ్మ రాక్షసి ఉంటోంది.  అది ఆ రాత్రి వస్తూనే తన మంచం మీద ఎవరో అపురూప లావణ్యవతి పడుకుని ఉండడం చూసింది. కోపంతో ఆ పిల్లని చంపి తినెయ్యాలని అనుకుంది.కాని,  దాని కప్పుడు ఆకలి అంతగా లేదు. అదీ కాక, అమాయికంగా కనిపిస్తున్న ఆ అమ్మాయిని వెంటనే చంపెయ్యడం దానికి ఇష్టం లేక పోయింది. నిద్ర లేపి ఆ పిల్ల వివరాలు తెలుసు కోవానుకుంది. వినోదిని నిద్ర లేస్తూనే మ్రహ్మ రాక్షసిని చూసింది. తనని చూసికూడా ఆ పిల్ల ఏమాత్రం భయపడక పోవడం బ్రహ్మ రాక్షసికి ఆశ్చర్యం కలిగించింది.
‘‘ అమ్మాయీ !నన్ను చూస్తూనే మీ నరమానవులందరూ వజవజా వణికి పోతారు. కానీ నువ్వు కించిత్తు కూడా భయ పడడం లేదు. కారణం ఏమిటి !?’’ అని అడిగింది. దానికి వినోదిని బ్రహ్మ రాక్షసితో ఇలా అంది : ‘‘ నాకో సవతి తల్లి ఉంది. ఆమె పెట్టే  బాధలు అంతా ఇంతా కాదు. ఆమె కనిపిస్తే చాలును ! నాకు పై ప్రాణాలు పైనే పోతాయి ! ఆవిడంటే కలిగే భయం ముందు నాకు ఇంకేవీ అంతగా భయ పెట్టవు !’’ అంటూ తన సవతి తల్లి పెట్టే హింసల గురించి ఏకరువు పెట్టింది. దానితో బ-హ్మ రాక్షసి మనసు కరిగి పోయింది. వెంటనే వినోదినికి తినడానికి మంచి ఆహారం సమకూర్చి, ఆమె సేద తీరాక, ఆమెకు ఒక మాయా దర్పణం, ఒక మాయ జలతారు చీర, మాయా పాద రక్షలు ఇచ్చి ధైర్యంగా కోటకు తిరిగి వెళ్ళమంది.
    వినోదిని కోటకు తిరిగి వెళ్ళడానికి మొదట భయ పడినా,ధైర్యం కూడదీసుకుని రాచ నగరుకి చేరు కుంది.  తిరిగి వచ్చిన వినోదినిని చూస్తూనే చిన్న రాణి కోపంతో ఊగి పోయింది. నానా దుర్భాషలూ ఆడింది.  కాని వినోదిని తన వెంట తెచ్చిన వస్తువులను చూసి కాస్త నిదానించింది. అవన్నీ వినోదిని నుండి లాక్కుంది. ముందుగా అందంగా మెరిసి పెతున్న మాయ జలతారు చీరని ముచ్చట పడి కట్టుకుంది.  అంతే ! ఆమె శరీరమంతా పొడలు పొడలుగా మారి పోయింది.  అది గమనించని చిన్న రాణి, ఆ మాయ జలతారు చీరలో తన అందం మాయా దర్పణంలో చూసుకోవాలనుకుంది. అంతే ! అద్దంలో తన వికృతాకారం చూసి కెవ్వు మంది. ఈ లోగా రాజు అక్కడికి వచ్చి, వికృతాకారంలో ఉన్న చిన్న రాణిని పోల్చు కోలేక, తక్షణం కోట వదలి పొమ్మని ఆదేశించేడు.  చిన్న రాణి రాజుతో  తన గురించి చెప్పాలనుకున్నా,  ఆమె గొంతు పెగల్లేదు! ఆమె భోరున ఏడుస్తూ మాయా పాద రక్షలను ధరించింది.  అంతే ! ఏదో ఒక వింత శక్తి  విసురుగా ఆమెను లాక్కు పోయి  సుదూర తీరంలో ఒక దట్ట మయిన అడవిలో పడవేసింది !
     అప్పటి నుండి రాకుమారి వినోదినికి సవతి తల్లి బాధలు తప్పాయి ! రాజు కూడా ఆమెను నిర్భయంగా ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టాడు. కొద్ది రోజులకే ఉజ్జయినీ రాజ కుమారునితో వివాహంజరిపించాడు..
      ఆ పెళ్ళికి ఆకాశమంత పందిరి ! భూ దేవంత ముగ్గు వేసారు ! మణి దీపాల కాంతులు రాత్రీ పగలు అనే తేడా లేకుండా చేసాయి ! మంగళ వాయిద్యాలూ. వేద మంత్రాలూ మారు మ్రోగి పోయాయి ! రాచ కుటుంబాల వారూ, పుర జనులూ , వారూ వీరని కాదు ఇసక వేస్తే రాలనంత మంది అతిథులతో కళకళలాడి పోయింది పెళ్ళి పందిరి !
   ఇక ఐదు రోజుల  ఆ పెళ్ళి వేడుకలో వడ్డించిన నవకాయ పిండి వంటల రుచులంటారా ?
   అబ్బో !  నేను చెప్ప లేను బాబూ !

       

22, డిసెంబర్ 2014, సోమవారం

ఊడల మఱ్ఱి !

ఉజ్జయినికి సమీపంలో కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. అందులో ఒక పెద్ద ఊడల మఱ్ఱి చెట్టు ఉండేది. దానిని అందరూ దెయ్యాల చెట్టు అనే వారు. దాని మీద ఒక బ్రహ్మరాక్షసి ఆ దారంట వెళ్ళే వారిని పీక్కు తినేదిట. ఎంతో అవసరం పడితే తప్ప, ఆ దారంట వెళ్ళడానికి ఎవరూ సాహసించే వారు కాదు ! ఇలా ఉండగా, ఆనందుడు అనే వాడు ఒక సారి జరూరుగా ఆదారంట వెళ్ళ వలసి వచ్చింది. అప్పటికే చీకటి పడింది. భయంతో వణికి పోతూ గబగబా నడవసాగేడు. ఆ చెట్టు దగ్గరకి వచ్చే సరికి, వాడికి ఒక వికటాట్టహాసం వినిపించింది. ఆనందుడికి ముచ్చెమటలు పోసాయి. కొయ్యబారిపోయి నిబడి పోయాడు. బ్రహ్మరాక్షసి పెద్ద గొందుకతో ఇలా అంది : ‘‘ ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం ! నేనిప్పుడే రెండు పెద్ద బర్రెలను తిని ఉన్నాను. ఆకలిగా లేదు. అలాగని వాటంగా దొరికిన నరమాంసాన్ని వదులు కోలేను ! నిన్ను తరవాత తింటాను. నేను ఈ ఊడల మఱ్ఱిని పట్టుకుని చాలా ఏళ్ళుగా ఉంటున్నాను. విసుగేస్తోంది. మరో చోటికి ఎక్కడికేనా వెళ్ళాలని ఉంది. అయితే, ఈ ఊడల మఱ్ఱి తనకి ఎన్ని ఊడలు ఉన్నాయో సరిగ్గా లెక్క కట్టి చెబితే కానీ వదలనంటూ పట్టుకుని ఉంది. నాకా, లెక్కలు సరిగా రావు ! అందు చేత, దీనికి ఎన్ని ఊడలు ఉన్నాయో లెక్క కట్టి చెబితే ఎక్కడికయినా హాయిగా వెళ్ళాలని ఉంది. అంతే కాదు, ఊడల లెక్క సరిగ్గా చెబితే, నిన్ను తినకుండా వదిలి పెడతాను. ’’ అంది. ఆనందుడు దొరికిన అవకాశాన్ని ఉసయోగించు కోవాలనుకున్నాడు. దీనంగా ముఖంపెట్టి, ఇలా అన్నాడు : ‘‘ దీని ఊడలు అసంఖ్యాకంగా ఉన్నాయి. చాలా దూరం వరకూ వ్యాపించి ఉన్నాయి. వాటిని లెక్క పెట్టు కుంటూ అంతదూరం నడవాలంటే నాకు శక్తి చాలదు !’’ అని. మ్రహ్మ రాక్షసి మరేం ఆలోచించకుండా వాడికి గాలిలో ఎగురుతూ వెళ్ళే శక్తినిచ్చే ఒక మంత్ర దండం ఇచ్చింది. దానిని అందుకుంటూ ఆనందుడు బ్రహ్మ రాక్షసితో ఇలా అన్నాడు : ‘‘ సరే ! దీని ఊడలు ఎన్ని ఉన్నాయో సరిగ్గా లెక్క పెట్టుకుని వస్తాను. అయితే, ఒక దీనికి ఒక నియమం ఉంది. నేను తిరిగి వచ్చే వరకూ నువ్వు ఎంతో నియమ నిష్ఠలతో ఉండాలి ! ఎలాంటి జంతు హింసా చేయ కూడదు ! ఈ నియమం తప్పావో, అక్కడ నా లెక్క తప్పుతుంది ! మళ్ళీ మొదటికి వస్తుంది ! జాగ్రత్త ! ’’ అన్నాడు. తెలివి తక్కువ బ్రహ్మరాక్షసి సరేనంది ! ఆనందుడు మంత్ర దండం సాయంతో అక్కడ నుండి మాయమైపోయేడు ! బ్రహ్మ రాక్షసి మాత్రం, ఆనందుడికి ఇచ్చిన మాట ప్రకారం మాంసాహారం మానివేసి. సరైన తిండీ తిప్పలూ లేక, నానాటికీ కృశించి పోయి బాగా బలహీన పడి పోయింది. ఇప్పుడు దానికి కదలడానికే కాదు ... మాట్లాడడానికి కూడా శక్తి చాలడం లేదు ! ఇప్పుడా దారి వెంట వెళ్ళే వారికి బ్రహ్మ రాక్షసి వలన ఏ ప్రమాదమూ లేదు! కావాలంటే మీరూ నిర్భయంగా వెళ్ళొచ్చు. ఊడల మఱ్ఱి చెట్టు అందాలను చూడొచ్చును !

11, డిసెంబర్ 2014, గురువారం

నమ్మకం గెలిపిస్తుంది ! అప నమ్మకంఓడిస్తుంది !




అశ్వ సేనుడు అవంతీ రాజ్యాన్ని పరిపాలించే రోజుల్లో, ఒక ఏడాది తీవ్రమయిన కరువు కాటకాలు ఏర్పడ్డాయి. నెలల తరబడి వొక్క వర్షపు చుక్క కూడా పడడం లేదు. భూములన్నీ బీడు వారి పోయేయి. ప్రభువుల ధనాగారం కూడా నానాటికీ తరిగి పోసాగింది. తిండికి కరువు రావడంతో రాజ్యంలో సంక్షోభం ఏర్పడింది. దారి దోపిడీలూ, దొంగతనాలూ పెచ్చు పెరిగి పోయేయి. ప్రజలు రాజ శాసనాలను ధిక్కరించే పరిస్థితి ఏర్పడింది. అశ్వ సేనుడి పాలన పట్ల ప్రజలకు నమ్మకం సడలి పోసాగింది.  రాజులో కూడా నానాటికీ అసహనం ఎక్కువ కాసాగింది. ఆకలికి తట్టుకో లేక పెట్టే ఆర్తుల మొర ఆలకించడం మానేసాడు. మీదు మిక్కిలి కఠిన దండనలు విధించ సాగేడు. అధిక పన్నులు వేయ సాగేడు.  దాంతో రాజ్యంలో అరాచకంమరింత పెరిగి పోయింది ! పరిస్థితి చెయ్యి దాటి పోతున్నదని మహా మంత్రి గమనించాడు. రాజ్యంలో అరాచక పరిస్థితుల నివారణకు తగిన పరిష్కారం కనుగొనడానికి వో సారి తపోవనవాసులయిన మునిజనం వద్దకు వెళ్ళి రమ్మని మహా మంత్రి, రాజ గురువు రాజుకి సలహా యిచ్చారు. అందుకు సమ్మతించి అశ్వ సేనుడు కొద్ది పాటి సైన్యంతో అటవీ ప్రాంతానికి బయలుదేరాడు.
      అరణ్య ప్రాంతంలో ప్రవేశించగానే , అక్కడి వాతావరణం చూసి రాజు చకితుడయ్యేడు ! అక్కడ అంతా పచ్చగా ఉంది. మునులూ, వారి శిష్యులూ పుష్ఠిగా వింత తేజస్సుతో వెలిగి పోతున్నారు !  రాచ నగరుకి అతి సమీపంలో ఉండే అటవీ భూములలో రాచ నగరులో వలె కరువు కాటకాలు లేక, అంతా పచ్చగా ఉండడానికి కారణం మునులను  ఇలా అడిగాడు.  ‘‘ మునులారా! ఈ ఆశ్రమ ప్రాంతం మా రాజ నగరుకి ఏమంత దూరంలో లేదు. కానీ అక్కడి కంటె భిన్న మయిన పిరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఈ అటవీ ప్రాతం కూడా నా ఏలుబడిలో ఉన్నదే కదా ! అతిసమీప ప్రాంతాలయినఈ రెడంటికీ నడుమ ఇంత తేడా ఎలా వచ్చింది ?’’ అనడగాడు.
    మునులు నవ్వి , ‘‘ రాజా ! ఇప్పుడు చూడు ! లా కనిపిస్తోందో !’’ అన్నారు.
రాజు చుట్టూ తేరిపార చూసాడు. ఆశ్చర్యం !  అక్కడి వాతావరణం రాచ నగరు కంటె భిన్నంగా ఏమీ లేదు ! కరువు అక్కడా తాండవిస్తోంది.  రాజుకి అంతా అయోమయంగా తోచింది.
    అప్పుడు మునులు రాజుతో ఇలా అన్నారు : ‘‘ మహా రాజా ! ఆపదలో ఉన్న మిమ్ములను మునుల మయిన మేము ఒడ్డెంక్కించ గలమనే నమ్మకంతోనే నువ్వు ఇక్కడకి వచ్చేవు. అందు వల్లనే నీకలా గోచరించింది. అంతే. దేనికయినా నమ్మకమే ప్రధానం ! ఈ కరువు పరిస్థితులు ఇక ఎన్నాళ్ళో ఉండవు. వెళ్ళి, నీప్రజలలో నీ పాలన పట్ల నమ్మకం కలిగించు. నమ్మకం గెలిపిస్తుంది. అప నమ్మకం ఓటమికి దారి చూపిస్తుంది !  వారిలో ఆత్మ విశ్వాసాన్ని కలిగించు. అప్పుడు అరాచకం తగ్గుతుంది ’’
   రాజు మునుల వద్ద శలవు తీసుకుని, రాజధానికి తిరిగి వచ్చి, మునులు చెప్పినట్టే తన ఏలుబడి పట్ల ప్రజలలో నమ్మకం కుదురు కునేలా చేశాడు.
  త్వరలోనే రాజ్యమంతటా విస్తారంగా వానలు కురిసాయి !
    రాజ్యం సుభిక్షమయింది !

3, డిసెంబర్ 2014, బుధవారం

కవులకు సత్కారం !


పూర్వం  ఒక గ్రామంలో  ముగ్గురు కవి పండితులు ఉండే వారు.  వారు ముగ్గురూ చక్కని కవిత్వం చెబుతూ చుట్టు ప్రక్కల గ్రామాలలో మంచి పేరు సంపాదించు కున్నారు.  కానీ , వారిని పేదరికం వెంటాడుతూ ఉండేది.  తమ రాజ్యాన్ని పాలించే రాజుని దర్శించుకుని, ప్రభువుల ఆశ్రయం పొందితే తప్ప , వారి దారిద్ర్యం తీరదని ఎవరో సలహా చెప్పారు.
    ‘‘ మనబోటి వారికి రాజాశ్రయం దొరకడం దుర్లభం ! వెళ్ళడం వృధా ప్రయాస ! ’’ అని, ఒక కవి నిరాశగా అన్నాడు.
   మరొక కవి, ‘‘ మన కవిత్వం గొప్పతనం విని, ప్రభువుల వారే మనల్ని ఆహ్వానించి సత్కరించాలి. అంతే తప్ప, మనంతట మనం వెళ్ళడం ఏమిటి !’’ అని వాదించాడు.
   మూడో కవి  వారిని బ్రతిమలాడి, ఎలాగో వారికి నచ్చ చెప్పి, రాచ నగరుకి బయలుదేర దీసాడు.  కవులు ముగ్గురూ రాచ నగరుకి వెళ్ళి, అక్కడ వో సత్రంలో బస చేసారు. రాజ దర్శనం అనుకున్నంత తేలికగా లభించదని వారికి అర్ధం కావడానికి అట్టే రోజులు పట్ట లేదు !
మొదటి కవి , ‘‘ ఇక రాజు గారి దర్శనం దొరకడం వట్టి మాట ! నేను ముందే చెప్పాను కదా ... నేను మన గ్రామానికి తిరిగి వెళ్ళి పోతున్నాను.  ’’ అన్నాడు. రెండో కవి ‘‘ నేనూ ముందే చెప్పాను కదా ! మనంతగా  మనం రాజ దర్శనానికి రావడంసరికాదని. అలా చేస్తే లోకువ అయి పోమూ ! మనం ఇక్కడకి రావడమే తెలివి తక్కువ.  నేను తిరిగి మన గ్రామం వెళ్ళి పోతున్నాను. ’’ అన్నాడు. ఆ ఇద్దరు కవులూ గ్రామానికి వెళ్ళి పోయాక,  మూడో కవి మాత్రం అక్కడే ఉండి, రాజ దర్శనం కోసం ఓపికగా నిరీక్షించ సాగేడు.
  వేగుల వలన రాజు ఈ ముగ్గురు కవుల గురించి విన్నాడు.  ముదుంగా గ్రామం నుండి మొదటి కవిని సభకి  పిలిపించాడు.  అతని కవిత్వం సాంతం వినకుండానే  అతనికి కొద్దిపాటి ధనం యిచ్చి, పంపించివేసాడు.  తర్వాత, గ్రామం నుండి  రెండో కవిని పిలిపించి, అతని కవిత్వం పూర్తిగా విని ఆస్వాదించి, అతనికి గొప్ప బహుమానాలు ఇచ్చి. సత్కరించి పంపించాడు.  ఆ తర్వాత, మూడో కవిని
అతను బస చేసిన సత్రానికి భటులను పంపి. సభకు రప్పించాడు.అతని కవిత్వం కొంచెం విని, తొలి కవికి ఇచ్చిన దానికన్నా కొంత ధనం ఎక్కువ ఇచ్చి పంపించాడు.
   ఇదంతా గమనిస్తున్న మహా మంత్రి రాజుతో ‘‘ ప్రభూ ! ఈ ముగ్గురు కవులలో ఏ ఒక్కరూ  తక్కువ ప్రతిభావంతులు కారు.  ముగ్గురి కవిత్వమూ ఒక్కలాగే రసవంతంగా ఉందికదా ! వారికి కానుకలు ఇవ్వడంలో ప్రభువులు వివక్ష చూపించడంలో ఏదో ఆంతర్యం ఉండే ఉంటుంది. అదేదో చెబితే వినాలని ఉంది. అనుగ్రహించండి ! ’’ అన్నాడు వినయంగా.
   రాజు నవ్వుతూ మంత్రితో  ఇలా చెప్పాడు :  ‘‘ మీరన్నట్టు ముగ్గురు కవులూ సమాన ప్రతిభావంతులే ! సందేహం లేదు. కానీ, మొదటి కవి ఒట్టి నిరాశా వాది. తన మీద తనకే నమ్మకం లేదు. అందు చేత, ఎప్పటికయినా అతని కవిత్వంలో పస తగ్గి పోయే వీలుంది.  మూడో కవి  చాలా ఓర్పు కల వాడు. అతనికి ఏ కొంచెం ఇచ్చినా, పొంగి పోయే రకం. మరిన్ని కానుకల కోసం, మెప్పు కోసం కవిత్వం వ్రాస్తూనే ఉంటాడు. కానీ మానెయ్యడు. ఇక, రెండో కవి గొప్ప ఆత్మాభిమానం ఉన్న కవి. కవులు నిరంకుశులు. అచంచల మయిన  ఆత్మాభిమానం ఉంటుంది. రెండో కవి అలాంటి వాడే. అతనికి సత్కారం చేయడంలో లోటు జరిగితే, ఆ కోపంతో ఇక మీదట కవిత్వ రచనకే స్వస్తి చెప్పే ప్రమాదం ఉంది ! అందుకే ముగ్గురు కవులనూ సత్కరించడంలోనూ, కానుకలు ఇవ్వడంలోనూ కావాలనే అలాంటి వివక్ష చూపించాను. వారు తమ ధోరణి మార్చు కున్నాక,  ఈ తడవ ముగ్గురికీ సమాన సత్కారాలు చేస్తాను. ’’ అని వివరించాడు.
    రాజు గారి  మాటలతో  సభ సంతోషంతో కరతాళధ్వనులతో మారు మ్రోగి పోయింది !

25, నవంబర్ 2014, మంగళవారం

దైవానుగ్రహం ఉంటే చాలు కదా !


పూర్వం అవంతీ రాజ్యంలో ఒక రాజు ఉండే వాడు. అతని పేరు నవనాథుడు. అతని రజ్యంశత్రు భయం లేకుండా ప్రశీంతంగా ఉండేది. ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండే వారు. ఎక్కడా అరాచకాలు  లేవు. ఆందోళనలు లేవు. ఆకలి చావులు అసలే లేవు.  ఇదంతా నత పరిపాలన లోని గొప్పతనం అని రాజు గట్టిగా నమ్మే వాడు.  దానితో అతనికి అహంకారం ఎక్కువయింది.
   నవనాథుని పూర్వీకులు ఎంతో భక్తి త్పరులు.  గుడులూ గోపురాలూ కట్టించేరు. ఎన్నో పుణ్య కార్యాలు చేసారు. పండితులను ఎంతో గౌరవంగా చూసుకునే వారు. నవనాథుని  పాలనలో అవన్నీ అంతరించి పోయాయి. దానికి కారణం రాజుకి దైవం మీద కన్నా,  త మీద ఉండ కూడనంత నమ్మకం ఉండడం చేతనే. దైవానిదేమీ లేదని, అంతా తన గొప్ప తనమేననీ అతడు నమ్మే వాడు.
    నవనాథుడు దైవ దూషన చేయక పోయినా, రాజ్యంలో దైవ కార్యాలకి ఏ మాత్రం ఆదరన లేకుండా పోయింది.దేవాలయాలు కళా విహీనాలయి పోయేయి !
పండితులకు ఆదరణ  లేకుండా పోయింది. రాజ పురోహితుడు సుశర్మ ఈ పరిస్థితి గమనించి చాలా బాధ పడ్డాడు. దైవానుగ్రహం గురించి రాజుతో ఒక రోజు సంభాషించేడు. రాజు ఆగ్రహించి, దైవానుగ్రహం కన్నా ప్రజలకు రాజానుగ్రహమే కావాలని వాదించాడు. ఏమీ అనలేక సుశర్మ మిన్నక ఉండి పోయాడు.
    ఇలా ఉండగా, కొన్నాళ్ళకు, రాచ కొలువులో కొన్ని ముఖ్య మయిన పదవులలో ఉద్యోగులను నియమించ వలసి వచ్చింది.  వాటిలో కొన్న పదవులు రాజు గారి అంత: పురంలో చేయాల్సినవి.  అంత: పురంలో కొలువు చేసే వారికి ఎక్కువ వేతనం ఉంటుంది.  మరి కొన్న రాజ్యం లోని వివివధ దేవాలయాలలో నిర్వర్తించాల్సినవి.  దేవాలయ విధులు చేసే వారికి వేతనం తక్కువగా ఉంటుంది. రాజు ఆ పదవులలో నియమించడానికి రాజ్యం లో నలు మూలలనుండి గొప్ప పండితులను పిలిపించాడు. ఆయా పదవులకు కావలసిన సంఖ్యలో  పండితులను ఎన్నిక చేసాడు. చిత్రంగా వారందరూ వేతనం తక్కవే అయినప్పటికీ,  దేవాలయాలలో విధులు చేయడానికే మొగ్గు చూపారు ! అంత: పురంలో ఉద్యోగానికి ఏ ఒక్కరూ సిద్ధ నడ లేదు.
     రాజుకి ఆగ్రహంతో పాటూ ఆశ్చర్యం కూడా కలిగింది ! అప్పటికి వారిని పంపి వేసి, సుశర్మను పిలిపించి వారలా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుందని అడిగాడు.
సుశర్మ అదే అదునుగా రాజుకి ఇలా వివరించాడు :  ‘‘ మహా రాజా ! తమ అనుగ్రహం వలన మన రాజ్యంలో ప్రజలూ , పండితులూ  ఎంతో సుఖ సంతోషాలతో ఉంటున్నారు.  దీనికి తిరుగు లేదు. ఈ మహా పండితులంతా తమ వకొలువులో కాకుండా, దేవాలయాలలో పని చేయడానికి ఒష్ట పడడానికి కారణం ఉంది. అదేమిటంటే, -  దైవానుగ్రహం ఉంటే, రాజానుగ్రహం ఎలాగూ ఉంటుందని వారు భావిస్తున్నారు. తమకు రాజానుగ్రహం ఎలాగూ పుష్కలంగా ఉంది కనుక ధనానికి లోటు లేదు. అందుకే  తమ అనుగ్రహం ఎప్పుడూ ఉండేలా వారు దైవానుగ్రహం కోరు కుంటున్నారు. అంచేతనే వేతనం తక్కు వయినప్పటికీ దైవానుగ్రహం పొందడానికి దేవాలయాలలో దైవ కార్యాలు చేయడానికే మొగ్గు చూపు తున్నారు. అంతే కానీ ఇది ప్రభువుల పట్ల అవిధేయత మాత్రం కాదు ! తమరు చిత్తగించాలి ’’ అని చెప్పాడు.
     మహా మంత్రి మాటలతో రాజులో పరివర్తన కలిగింది. అహంకారం తొలిగి పోయింది.
ఆ నాటి నుండీ ఆ రాజ్యంలో వేవాలయాలు తిరిగి కళకళలాడుతూ వర్ధిలాయి.
ప్రజలు  రెట్టించిన సుఖ సంతోషాలతో జీవించడం మొదలు పెట్టారు.
    శత్రు రాజ్యాలు దాని వేపు కన్నెత్తి చూస్తే వొట్టు!
     

16, నవంబర్ 2014, ఆదివారం

అడగ వలసిన అసలు ప్రశ్న !


చామలా పల్లి అగ్రహారంలో మార్కండేయ శాస్త్రి అనే ఒక మహా పండితుడు ఉండే వాడు. అతడు చిన్నప్పుడే అన్ని శాస్త్రాలూ ఔపోసన పట్టాడు. పురాణేతిహాసాలు క్షుణ్ణంగా చదువు కున్నాడు. చుట్టు ప్రక్కలే కాక, సుదూర ప్రాంతాలలో ఉండే జమీందారీలలో కూడా అతనికి సాటి వచ్చే పండితుడు లేడని ప్రతీతి ! చాలా మంది అతని దగ్గర విద్యలు అభ్యసించి , మహా పండితులయ్యేరు. అతనికి లెక్క లేనన్ని బిరుదులు వచ్చేయి. సువర్ణఘంటా కంకణ ధారణ, గజారోహణాలూ లాంటి గొప్ప సత్కారాలు అనేకం జరిగాయి.  దానితో అతనికి అహంకారం ఎక్కువయింది. తన మాటే వేద వాక్కు అని తలచే వాడు. అతని పాండిత్యం  ముందు నిలువ లేక, ఎవరూ అతని ఎదుట నోరు మెదప లేక పోయే వారు.
    మార్కండేయ శాస్త్రికి ఒక్కతే కూతురు.  పేరు కమలిని. మగ సంతానం లేదు.  కమలిని అపురూప సౌందర్యవతి.  వినయ సంపన్నురాలు.  మెకు యుక్త వయసు వచ్చేక, మార్కండేయ శాస్త్రి ఆమెకు వివాహం చేయాలని తల పెట్టాడు. ఎంద రెందరో ఎన్నో మంచి సంబంధాలు తీసుకు వచ్చారు.  కాని, తన బిడ్డకు తగిన జోడును తాను మాత్రమే ఎన్నిక  చేయ గలనని  అతని ఆలోచన.  అందు వలన ఎవరెంత గొప్ప సంబంధం తెచ్చినా ,ఏదో వంకతో తిరస్కరించే వాడు. తనతో వియ్యమందడానికి వచ్చిన వారిని, పెండ్లి కుమారులనూ అతను చాలా జటిల మయిన ,శాస్త్ర సంబంధమయిన ప్రశ్నలు అడిగే వాడు. వారితో శాస్త్ర చర్చలకు దిగే వాడు.  వారి మేధస్సుకు పరీక్ష పెట్టే వాడు. తర్క మీమీంసాది శాస్త్రాల లోనే కాక, పురాణాల నుండి, ప్రబంధాల నుండీ  చాలా క్లిష్ట మయిన ప్రశ్నలు అడిగే వాడు.
వాటికి సమాధానాలు చెప్ప లేక ,వచ్చిన వాళ్ళు బిక్క ముఖాల పెట్టే వారు.  దాంతో, వచ్చిన మంచి సంబంధా లెన్నో తిరిగి పోయేవి. అతను వేసే ప్రశ్నలకు అంతూ పొంతూ ఉండేది కాదు ! అతి కష్టం మీద ఎన్నింటికి జవాబులు చెప్పినా, అతనికి తృప్తి ఉండేది కాదు ! మరిన్ని అడిగి, వారి నోళ్ళు మూయించే వాడు.
అతని ధోరణి చూసి ,అతని భార్య ఇందు మతికి చాలా దిగులుగా ఉండేది. ఇలా అయితే పిల్లకి జన్మలో పెళ్ళి కాదని తెగ బాధ పడుతూ ఉండేది.
    ఇలా ఉండగా, ఆ గ్రామానికి కాశీ నుండి ఒక మహా పండితుడు వచ్చి దేవాలయంలో విడిది చేసాడని ఇందు మతి విన్నది. వినయ రాహులుడు అనే అతని కొడుకు కూడా అతని వెంట ఉన్నానీ, అవివాహితుడనీ, మంచి రూపసి అనీ కూడా వింది. అంతే కాదు బాదా చదువు కున్న వాడని , మంచి జమీందారీ నౌకరీ కూడా చేస్తున్నానీ కూడా తెలిసింది.  ఆ యువకుడు కమలినికి ఈడూ జోడూ అని కూడా తెలుసుకుని మురిసి పోయింది. ధైర్యం చేసి. తన మనసు లోని మాట తన అన్న గారి ద్వారా ఆ పండితునికి తెలియ జేసింది.
     ఆ పండితుడు తన కుమారుడు వినయ రాహులుడిని  వెంట పెట్టుకుని, పెళ్ళి చూపులకు వచ్చేడు. ఎప్పటి లాగే, మార్కండేయ శాస్త్రి తన ప్రశ్నల వర్షం వారి మీద కురిపించాడు.  ఆ కాశీ పండితుడూ, అతని కుమారుడూ వాటికి చక్కగా సమాధానాలు చెప్పారు. గంటలు గడుస్లున్నాయి. కానీ, శాస్త్ర చర్చ మాత్రం ముగియడం లేదు ! ఆ సంబంధం ఎలాగయినా కుదిరితే బాగుణ్ణు ! అని ఆశ పడుతున్న వారందరికీ ఆదుర్దాగా ఉంది.
     ఆ సమయంలో కాశీ పండితుడు మార్కండేయ శాస్త్రి గారితో ఇలా అన్నాడు : ‘‘ అయ్యా ! మీరు మహా పండితులు ! దానికి తిరుగు లేదు ! మా గురు దేవులు అనుగ్రహించిన  విద్య వలన మేమూ తగిన జవాబులు చెప్ప గలిగాము. కానీ, మేము అడిగే ఒకే ఒక ప్రశ్పకు మీరు సమాధాన మివ్వాలని వినయంగా కోరు కుంటున్నాము ’’ అన్నాడు. దానికి మార్కండేయ శాస్త్రి సమ్మతించాడు.
      ‘‘ ఇంత వరకూ మీ అమ్మాయికి చాలా సంబంధాలు వచ్చాయనీ,
మీ శాస్త్ర   చర్చలతో అవి తిరిగి పోయేయనీ విన్నాను.  మీరు వచ్చిన వారి పాండిత్యాన్ని పరీక్షిస్తూ ఉండి పోయారే తప్ప , ఏనాడయినా, మీ అమ్మాయి మనసులో ఏముందని ఒక్క నాడయినా అడిగారా !  ఇదే నేను అడిగే ప్రశ్న!’’  అని అడిగాడు కాశీ పండితుడు.  దానితో మార్కండేయ శాస్త్రికి కోపం ముంచు కొచ్చింది.
    ‘‘ ఇదేం ప్రశ్న ! ఇలాంటి లౌకిక మయిన ప్రశ్నలకి నేను జవాబులు
 చెప్పను ! ’’ అన్నాడు కోపంగా.
   ‘‘ అయ్యా !  క్షమించాలి ! నేను  తమను వొకే ఒక్క ప్రశ్న అడుగు తానన్నాను కానీ, అది లౌకిక మయినదా , కాదా అని చెప్ప లేదు !  అదీ కాక, వివాహం చేసు కోవడం, కాపురం చేయడం అనేవి లౌకిక సంబంధ మయిన విషయాలని తమకు నేను చెప్ప నక్కర లేదు !’’ అన్నాడు కాశీ పండితు.
    సూక్ష్మ బుద్ధి గల మార్కండేయ శాస్త్రి కి కాశీ పండితుని మాటలలో ఆంతర్యం అర్ధ మయింది.  మరో ఆలోచన లేకుండా అతనితో వియ్య మందడానికి అంగీకరించాడు ! అంతా సంతోషించారు.        మంచి ముహూర్తాన కాశీ పండితుని కుమారుడు వినయ రాహులుడితో  కమలిని వివాహం అంగరంగ వైభోగంగా జరిగింది.
         ఇప్పుడా దంపతులకి వొక చక్క దనాల కొడుకు కూడానూ ! రేపో మాపో నామ కరణం చెయ్య బోతున్నారు.  మీకూ పిలుపు  వస్తుంది. వెళ్ళి ఆశీర్వదించి వస్తారు కదూ ? !


        

9, నవంబర్ 2014, ఆదివారం

అపాత్ర దానం !


అవంతీ పురాన్ని పాలించే రాజు గుణ శేఖరుడు గొప్ప దాన గుణం కలవాడు. అతని చేతికి ఎముక లేదని అందరూ చెప్పుకునే వారు. యాచకుల పాలిట కల్ప వృక్షంలా ఎప్పుడు ఎవరు వచ్చి అడిగినా కాదనే వాడు కాదు. దాంతో ఆ రాజ్యంలో యాచకుల సంఖ్య తామర తంపరగా పెరిగి పోయింది. రాజ్యంలో ప్రజలందరూ ఒట్టి సోమరులయ్యేరు. రాజు గారిచ్చే దానాలతో వారికి సుఖంగా గడిచి పోతూ ఉండేది. ఊర్లో ఎక్కడ చూసినా, రాజు గారు స్థాపించిన చిత అన్న దాన సత్రవులే !  అక్కడ ముప్పూటలా అన్న దానం జరుగుతూ ఉండేది. ఇలా రాజు గారు క్రిందా మీదా చూడకుండా దానాలు చేస్తూ ధనం ధారాళంగా వ్యయం  చేయడంతో కోశాగారం ఖాళీ అయ్యే పరిస్థితి దాపురించింది. ప్రధాన మంత్రి వివేక వర్ధనుడు ఇదంతా గమనించి ఆందోళన చెందాడు. ఎలాగయినా పరిస్థితి చక్క దిద్దా లనుకున్నాడు. మహా రాజుని కలుసుకుని,  దాన గుణం  ప్రభువులకు ఉచితమే కానీ,  అనుచిత దానాలూ, అపాత్ర దానాలూ చేటు తెస్తాయని ఎంతగానో నచ్చ చెప్పి చూసాడు. భాండాగారంలో ధనం నిల్వలు తగ్గి పోతాయనీ, అదే అదనుగా శత్రువులు రాజ్యం మీదకి దండెత్తి వచ్చే ప్రమాదం ఉందనీ ఎంతగానో వివరించి చెప్పాడు. అయితే,  రాజు మంత్రి మాటలు విన లేదు.  సరికదా, అతని మీద ఆగ్రహించి,  మంత్రి పదవి నుండి తొలగించి, రాజ్య బహిష్కారం శిక్ష విధించాడు !
మహా మంత్రి బాధ పడుతూ రాజాఙ్ఞ తల దాల్చి రాజ్యం విడిచి వెళ్ళి పోయాడు.
    అయితే, వివేక వర్ధనుడు రాజ్యం విడిచి దూరంగా ఏమీ వెళ్ళి పో లేదు. కొంత మంది నమ్మకస్థులయిన పరివారంతో రాజధానికి సమీపంలోనే అడవిలో రహస్యంగా ఉంటూ వచ్చేడు.  తగిన సమయం చూసి రాజుకి కళ్ళు తెరిపించాలని పొంచి ఉన్నాడు.  కొంత కాలం గడిచాక, వివేక వర్ధనుడు గుణ నిధి రాజ్యమంతటా వ్యాపించేలా ఒక పుకారు లేవదీసాడు. శత్రురాజులంతా ఏకమై ఒక్క సారిగా గుణ నిధి రాజ్యం మీదకి దండెత్తి రాబోతున్నారని పుకారు పుట్టించాడు. రాజు తన వేగులను సమావేశ పరచి ఆ వార్త గురించి అడిగాడు.  రాజు చాలా కాలంగా దాన ధర్మాంటూ రాజ్య పాలనను నిర్లక్ష్యం చేడంతో వేగులు కూడా తమ విదుల పట్ల అంతే అలసత్వంతో ఉంటున్నారు. అంచేత వాళ్ళు అందు లోని నిజానిజాలు పరిశీలించ కుండానే అది నిజమేనని రాజుకి చెప్పారు ! దానితో రాజులో ఆందోళన ఎక్కువయింది.  కోశాగారం పూర్తిగా ఖాళీ అయింది. జీత భత్యాలు  అందక సైనికులు నిస్తేజంగా ఉన్నారు.  వాళ్ళు తన కోసం నిండు మనసుతో పోరాడుతారో, లేదో తెలియదు !  ప్రజలంతా కూడా ఒట్టి పోమరులుగా తయారయ్యేరు. రాజుకి ఏమీ తోచ లేదు.
      ఈ పరిస్థితిలో మంత్రి వివేక వర్ధనుడు మారు వేషంలో రాజు వద్దకు వచ్చేడు.  రాజుతో ఇలా అన్నాడు :  ‘‘ మహా రాజా ! నేను లోగడ తమ నుండి అపార ధనరాశులను కానుకగా పొంది ఉన్నాను. ఇప్పుడు రాజ్యం తీవ్రమయిన సంక్షోభంలో పడి ఉందని తెలుస్తోంది.  అందు చేత తమరు నాకు లోగడ ఇచ్చిన ధనం యావత్తూ తమకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. అయితే, ప్రభువులు మన్నించాలి. యుద్ధం ముగిసేక,  నేనిచ్చిన ధనానికి రెట్టింపు ధనం తమరు నాకు ఇప్పించ వలసినదిగా కోరు తున్నాను.  మన రాజ్యంలో తమ నుండి కానుకలు పొందిన వారంతా ఇలాగే చేస్తే తమ కోశాగారం నిండటమే కాక, శత్రువులతో యుద్ధం చేయడం తేలికవుతుంది.  యుద్ధం ముగిసాక ఎలాగూ వారిచ్చిన ధనానికి తమరు రెట్టింపు ధనం ఇవ్వనున్నారు కనుక ఎవరూ సంశయించ కుండా ఆ ఆశతోనయినా తాము లోగడ మీనుండి పొందిన ధనం తెచ్చి తమకు సమర్పిస్తారనే నా నమ్మకం ! ’’ అని చెప్పాడు.  రాజు కోశాగారం నిండడానికి మరో మార్గం లేదు కనుక, అందుకు సరేనని రాజ్యమంతాటా ఆ మేరకు చాటింపు వేయించాడు.
    చిత్రం ! రోజులు గడుస్తున్నాయి కానీ, ఏ ఒక్కరూ రాజ్యానికి నిధులు సమకూర్చడం లేదు ! కారణం ఏమై ఉంటుందా ! అని రాజు ఆరాతీసాడు. యుద్ధంలో రాజు గెలుస్తాడని  నమ్మకం ఏమిటి ?           గెలిచినా, మనకి తిరిగి రెట్టింపు ధనం ఇస్తాడని ఏమిటి నమ్మకం ! అని ప్రజలంతా భావిస్తున్నట్టుగా గ్రహించాడు !
    దానితో రాజుకి మనసంతా వికలమై పోయింది.  రాజ్యం విడిచి పెట్టి అడవులకు వెళ్ళి పోవాలని నిశ్చయించు కున్నాడు. సరిగ్గా ఆ దశలో  మంత్రి వివేక వర్ధనుడు రాజు ఎదుట పడి ఇలా అన్నాడు : ‘‘ రాజా ! తమ అనుమతి లేకుండా తమ ఎదుటికి వచ్చినందుకు మన్నించాలి ! ఇప్పుడు మన రాజ్యానికి వచ్చిన ఆపద ఏమీ లేదు ! ఇదంతా నేను కల్పించిన పుకారు !  మన శత్రు రాజ్యాలలో కూడా మన రాజ్యంలో మీవలన లబ్ధి పొందిన ప్రజలంతా తమకు అపారమయిన ధనరాశులు  సమకూరుస్తున్నారనీ,  మన రాజ్యం కోసం కోట్లాది మంది ప్రజలు ప్రాణ త్యాగం చెయ్యడానికి కూడా తమ వెంట ఉన్నారని పుకారు లేవ దీసాను ! దానితో  ఇక ముందు కూడా మన దేశం మీదకి దండెత్తి రావడానికి ఎవరూ  సాహసించ లేరు ! ఇప్పటికయినా ప్రభువులు వాస్తవాన్ని గమనిస్తారని
 ఆశిస్తాను ! ’’ అని ముగించాడు.
   గుణ వర్ధనుడు మహా మంత్రి మాటలతో పరివర్తన చెందాడు. రాజ ధర్మంగా దానాలు చేయడం మాన లేదు కానీ,  అపాత్ర దానాలు చేయడం  మాత్రం మాను కున్నాడు. వివేక వర్ధనుని తిరిగి తన కొలువులో  మహా మంత్రిగా నియమించాడు.
       అవంతీ రాజ్యం త్వరలోనే సుభిక్ష మయింది !

2, నవంబర్ 2014, ఆదివారం

జగడాల పల్లె !



జగడాల పల్లె అసలు పేరు పద్మా పురం.  ఒకప్పుడు ఆగ్రామంలో పట్టుమని పది గడపలు కూడా ఉండేవి కావు. కానీ ఆఇళ్ళ వారికి ఎప్పుడూ ఒకరంటే ఒకరికి పడేది కాదు !  ఎప్పుడూ ఎందుకో ఒకందుకు గొడవలు పడుతూనే ఉండే వారు. ప్రతి చిన్న విషయానికీ ఒకరి మీద ఒకరు కయ్యానికి కాలు దువ్వుతూ ఉండే వారు.  అందుచేత ,చుట్టు ప్రక్కల గ్రామాల వారికి ఆఊరంటే చులకన భావం ఏర్పడి పోయింది.  ధర్మా పురాన్ని అందరూ జగడాల పల్లె అని వేళాకోళం చేస్తూ ఉండే వారు.
        పద్మా పురానికి చెందిన వర్ధన రావు అనే యువకుడికి మాత్రం తమ గామ ప్రజల ప్రవర్తన తల కొట్టేసినట్టుగా ఉండేది. చాలా సంవత్సరాలు పెద్ద చదువుల కోసం పెద్ద పట్టణాలలో గడిపాడేమో, , వాడిలో  లోకానుభవం వల్ల చక్కని సంస్కారం ఏర్పడింది. గ్రామస్థుల కజ్జాకోరు తనం వల్ల ఊరికి చెడ్డ పేరు వస్తోందని వాడు దిగులు చెందుతూ ఉండే వాడు. మంచిగా చెప్తే వాళ్ళు వినరని అతడికి తెలుసు. ఏదో విధంగా ఊరి ప్రజలలో మార్పు తీసుకుని రావాలని అతడు నిర్ణయించు కున్నాడు.
     ఇలా ఆలోచించి, ఒక రోజు రాత్రి ఎవరూ చూడకుండా ఒక తోడేలు బొమ్మ ఉండే పతాకాన్ని ఒక యింటి కప్పు మీద ఉంచేడు.  దానితో ఆ ఇంటి యజమాని భయపడి పోయి మర్నాడు ఉదయాన్నే  వర్ధన రావు దగ్గరకి వచ్చి ఆ విషయం చెప్పాడు. గోవర్ధన రావు అతని భయం మరింత రెట్టింపు అయ్యేలా మాట్లాడేడు.  అదేదో అరిష్ట పతాకంలా ఉందని అన్నాడు. దాని విషయమై తాను పట్నం వెళ్ళి ప్రముఖ సిద్ధాంతి గారిని అడిగి తెలుసుకుని వస్తానని అభయమిచ్చాడు. హమ్మయ్య ! ఆ పని త్వరగా చేద్దూ, నీకు పుణ్యం ఉంటుంది ! ’’అని  బ్రతిమాలి అతడు వెళ్ళి పోయేడు.
     ఆ తరువాత అలాగే వరుసగా ప్రతి రాత్రీ అందరి ళ్ళ మీదా అలాంటి పతాకాలే ఉంచడం మొదలు పెట్టాడు వర్ధన రావు. భయంతో తన దగ్గరకి పరుగెతు కొచ్చిన అందరికీ  అవి అరిష్ట పతాకాలే ! అని నమ్మబలికే వాడు. దానితో ఊరంతా గగ్గోలెత్తి పోయింది ! వాటి విషయమై వెంటనే పట్నం వెళ్ళి సిద్ధాంతి గారిని కనుక్కు రమ్మని అతని మీద  ఒకరోకరే ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు.  ఇదిగో, అదిగో ! అంటూ వర్ధన రావు వారిని ప్రతి రోజూ త్రిప్పి పంపించేస్తున్నాడు. దానితో ఊరి వాళ్ళు విసిగి పోయేరు.  ఇక లాభం లేదని, వొక రోజు ఆ ఇళ్ళ జమానులందరూ కలసి కట్టుగా వర్ధన రావు దగ్గరకి వచ్చి దీనంగా ఇలా వేడు కున్నారు : ‘‘ అరిష్ట పతాకాల గురించి పట్నం వెళ్ళి సిద్ధాంతి గారిని కనుక్కు రమ్మని  అడిగితే ఇన్ని రోజులూ వెళ్తానంటూనే జాప్యం చేస్తున్నావు !  మన గ్రామంలో చదువు కున్న వాడివి నువ్వొక్కడివే. మేం ఎవరం ఎప్పుడూ పట్నం మొహం చూసి రుగని
వాళ్ళం ! పట్నం భోగట్టాలు తెలిసిన వాడివని నీ సాయం కోరితే, నువ్వేమో రోజుల తరబడి దాట వేస్తున్నావు. అరిష్ట పతాకాల వల్ల మా ఎవరికీ రాత్రిళ్ళు కంటికి నిద్ర పట్టడం లేదు ! భయతోం వణికి పోతున్నాం ! పట్నం బయలుదేరకుండా ఆలస్యం చేస్తున్నావు. నీకిది ధర్మంగా లేదు సేమా ! ’’ అని నిష్ఠూర మాడేరు.
     వారి మాటలు విని వర్ధన రావు కోపం నటిస్తూ  వారితో ఇలా అన్నాడు :
‘‘ మీలో మీకు ఎప్పుడూ సఖ్యత లేదు ! ఎప్పుడూ దేనికో ఒక దానికి కీచులాడుకుంటూ ఉంటారు. మన గ్రామం పరువు మంట కలుపు తున్నారు. మీకు కష్టం వచ్చింది కనుక, ఇప్పుడు మాత్రం అంతా ఒకటిగా  నా దగ్గరకి వచ్చేరు. ఈ కష్టం ఒడ్డెక్కాక మళ్ళీ మామూలుగా మీలో మీరు దెబ్బలాడుకుంటూ ఉంటారు.  అంచేత,  ఇప్పుడు మీకు నేను మాత్రం మీకు ఎందుకు సాయం చేయాలి. వెళ్ళి రండి ! ’’ అని కసిరి చెప్పాడు.
    దానితో కంగు తిన్న గ్రామస్థులు ముక్త కంఠంతో ఇక మీదట అలా ప్రవర్తించమనీ,  అంతా కలసి మెలసి ఉంటామనీ ప్రమాణం చేసారు. తమ తప్పులు మన్నించి, వెంటనే పట్నం వెళ్ళి అరిష్ట పతాకాల గురించి తెలుసుకుని రమ్మని వేడు కున్నారు.
    అప్పుడు వర్ధన రావు నవ్వి ఇలా చెప్పాడు : ‘‘అరిష్ఠ పతాకాలు అనేవి ఒక మూఢ విశ్వాసం ! అవి నేను పెట్టిన పతాకాలు ! మీలో భయం కలిగించి, మీ మధ్య సఖ్యత కలిగించడం కోసమే నేను వాటిని మీ ఇళ్ళ మీద ఉంచేను ! మూఢ నమ్మకం విషయంలోనే భయంతో ఒకటైన మీరు మన ఊరికి చెడ్డ పేరు రాకుండా కలసి మెలసి ఉండ లేరూ ! ’’ అన్నాడు.
      వర్ధన రావు మాటలతో ఊరి ప్రజలలో మంచి మార్పు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇదివరకటిలా తగవు లాడు కోవడం లేదు. చక్కగా కలసి మెలసి ఉంటున్నారు.
        జగడాల పల్లెను వోసారి  చూసొద్దామని అనుకుంటున్నారేమో  ! అదిప్పుడు కుదిరే పని కాదు ! . ఎందుకంటే పద్మా పురానికి జగడాల పల్లె అని వచ్చిన చెడ్డ పేరు ఇప్పుడు  పూర్తిగా తొలగి పోయింది !
 అంత సఖ్యంగా  జనాలుండే గ్రామం ఇప్పుడు ఆఫిర్కా లోనే లేదంటే నమ్మండి !