19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

దుర్బుద్ధి


ఒక అడవిలో జంబుమాలి అని ఒక నక్క ఉండేది.అది చాలా జిత్తులమారి నక్క! అంతే కాదు, గొప్ప స్వార్ధపరురాలు కూడా. రోజూ ఉదయాన్నే లేచి, దేవుడిని ఇలా వేడుకునేది :  ‘‘ దేవా ! ఈ అడవిలో అంతా నన్ను నీచంగా చూస్తూ ఉంటారు. నేను టక్కరి దానినట. జిత్తులమారినట.. అందు చేత ఇవాళ ఈ అడవి జంతులు వేటికీ తిండి దొరక కుండా చెయ్యి. అంతే కాదు, నాకు మాత్రం కడుపు నిండి పోయేటంత  మంచి తిండి దొరికేలా చూడు ! అలా చెయ్యి తండ్రీ ! ఈ అడవిలో నేను తప్ప మిగతావి ఏవీ సుఖంగా ఉండ కూడదు ! వాటి పొగరు అణిగి
 పోవాలి ! ’’ అని వేడుకునేది.
     ఒక రోజు నిద్ర లేస్తూనే ఎప్పటిలాగే దేవుడిని వేడుకుని, తిండి కోసం బయలు దేరింది జంబుమాలి. అలా వెళ్ళగా వెళ్ళగా దానికి ఒక చోట అప్పుడే చచ్చి పడున్న ఒక పెద్ద ఏనుగు కళేబరం కనబడింది. నక్క ఆనందానికి అంతూ పొంతూ లేకుండా పోయింది. చుట్టూ చూసింది. ఇంకా ఎవరూ ఆ ఆహారాన్ని చూసినట్టుగా లేదు. ఏమి నా అదృష్టం ! ’  సంతోషంగా  అనుకుంది నక్క. ‘‘ దేవుడా ! ఈ రోజు నాకు కడుపు నిండా తిండి దొరికేలా చేసావు. నీకు నిజమైన నీ భక్తు లెవరో ఇప్పటికి తెలిసింది కదా ! ’’  అని దేవుడికి కృతఙ్ఞతలు చెప్పుకుంది.
       ‘‘ ఇన్నాళ్ళకు దేవుడు నా మొర ఆలకించాడు. నాకు పుష్కలంగాతిండి దొరికేలా చేసాడు. అలాగే, నేను కోరినట్టుగా  తక్కిన అడవి జంతువులు వేటికీ ఇవాళ తిండి దొరక్కుండా చేసాడో , లేదో , చూడాలి. అడివంతా తిరిగి ముందు
ఆ విషయం తెలుసుకుంటాను. తిండి దేముంది! ఇలా వెళ్ళిఅలా వచ్చెయ్యనూ! వచ్చేక, కడుపు పగిలేలా  తినొచ్చు ! ’’  అనుకుంటూ తనకు దొరికిన ఆ ఏనుగు కళేబరాన్ని ఎవరి కంటా పడకుండా ఉండేలా ఒక చోట దాచి, ఆకులూ అలమలూ కప్పి జాగ్రత్త చేసింది.
   తర్వాత అక్కడ నుండి బయలు దేరి, కనబడిన ప్రతి జంతువునూ ‘‘ నీకివాళ తిండి దొరికిందా ? ’’ అని అడగడం మొదలు పెట్టింది.  ముందుగా పులి కనబడితే ‘‘ పులి రాజా ! భోజన మయిందా ? ’’ అనడిగింది. దానికి పులి ఉసూరుమంటూ ‘‘నేను ముసిలిదానినైపోయాను. మునుపటిలా వేటాడే ఓపిక ఉండడం లేదు. వాళ తినడానికి ఏమీ దొరక లేదు. ఆకలితో నా కడుపు కాలి పోతోంది ’’ అంది దీనంగా.
నక్క పైకి ‘‘ అయ్యో, పాపం ! ’’ అంటూ జాలి నటించింది.  లోలోపల సంతోషపడుతూ అక్కడి నుండి బయలు దేరింది. తర్వాత అడివంతా చాలా దూరం చక్కబెట్టింది. ఏ జంతువుని అడిగినా తిండి దొక లేదనే చెప్పడంతో నక్క ఆనందం అంతా యింతా కాదు !  మంచి శాస్తి జరిగింది ! అని  సంబర పడి పోయింది. పైకి మాత్రం వాటి పట్ల సానుభూతి చూపిస్తూ మాటలాడేది.
    ఆ రోజు నక్కకి అడివంతా ఎంత తిరిగినా  తృప్తి కలగడం లేదు. ఒళ్ళూ మీదా తెలియడం లేదు. ఇదిగో , అదిగో మరో దాన్ని అడిగి చూదాం ! అనుకుంటూనే అడివంతా  తిరుగుతూనే ఉంది. ఏ జంతువూ తనకు తిండి దొరికిందని చెప్పక పోవడంతో దాని ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
     అలా తిరుగుతూ ఉండగానే చీకటి పడి పోయింది. కుండ పోతగా వర్షం మొదలయింది. పిడుగులూ, టఉరుములతో నానా బీభత్సంగా తయారయింది. చుట్టూ చీకటి కమ్ము కోవడంతో నక్క ఒక్క అడుగు తీసి ముందుకు వెళ్ళ లేక పోయింది. ఆ జడి వానకి అడవిలో  చెట్లన్నీ విరిగిపడి ,దారీ తెన్నూ కనిపించేలా లేదు.  భయంతో ఒక చెట్టు తొర్రలోకి దూరి, చలికి వణికి పోతూ బిక్కు బిక్కుమంటూ గడిపింది. వాన ఎంతకీ తగ్గ లేదు.
   అప్పుడు దానికి తన ఆకలి గుర్తుకొచ్చింది. ఆకలితో కడుపు దహించుకు పోసాగింది. దానికి తోడు, అడవి జంతవులు తిండి దొరక లేదని తనతో అబద్ధం కానీ చెప్ప లేదు కదా ! అనే అనుమానం దానికి అప్పుడు  కలిగింది. ఉదయం నుండీ తిండి మాట ఎత్తకుండా తిరిగి తిరిగి అలిసి పోయాను ! చలికి వణికి పోతున్నాను. తిండి లేక నీరసంతో అడుగు కదప లేక పోతున్నాను. ఆకలి మండి పోతోంది. అడవి జంతువలన్నీ ఈ సరికి దొరికిందేదో తిని వెచ్చగా పడుకున్నాయి కాబోలు ! అనుకుంది.
     ఈ ఆలోచన దానిని ఆకలి బాధ కంటె ఎక్కువగా బాధించింది.
      ఆకలి బాధతో ఏడుస్తూ అది సొమ్మసిల్లి పడి పోయింది.
      దుర్బుద్ధికి ఫలితం ఇలాగే ఉంటుంది కదా !!


17, సెప్టెంబర్ 2014, బుధవారం

నోటికి తాళం !


అనగా అనగా ఒక ఊళ్ళో సోమయ్య అనే ఒక ఆకతాయి ఉండే వాడు. పెద్దంతరం,చిన్నంతరం లేకుండా ఎవరిని పడితే వారిని ఎంత మాట తోస్తే అంత మాట అనెయ్యడం వాడికి అలవాటు ! ఎవరెంత నచ్చ చెప్పినా వినిపించు కునే వాడు కాదు. వాడి  నోటికి జడిసి ఊళ్ళో అంతా వాడికి దూరంగా మెలగ సాగేరు.
    ఇలా ఉండగా ఒక నాడు ఆ ఊరికి గొప్ప యతీంద్రుల వారు ఒకరువచ్చేరు. అతనికి గొప్ప మహిమలు ఉన్నాయని అందరూ పొగుడుతూ ఉండే వారు. ఆ సంగతి సోమయ్య చెవిని కూడా పడింది. సోమయ్య  ఆ యతీంద్రుని గురించి చాలా విన్నాడు.  జరిగిందీ, జరుగ బోయేదీ కూడా  ఒక్క పిసరు పొల్లు పోకుండా చెప్ప గలరని విన్నాడు. అంతే కాకుండా వారిని దర్శించు కుంటే  గొప్ప మేలు జరుగుతుందని కూడా విన్నాడు.  సోమయ్యకి కూడా  ఆ యతీంద్రుల వారిని దర్శించు కోవాలని బుద్ధి పుట్టింది.  అలా అనుకుంటూనే  ఏ రోజుకారోజు బద్ధకించి, రోజులు గడిపేసాడు. వాడికి బుద్ధి పుట్టి,  ఓ రోజు సాయంత్రం వెళ్ళే సరికి
 ఆ యతీంద్రుల వారు  ఆ ఉదయమే ఊరు విడిచి  వెళ్ళి పోయేరు !
    సోమయ్యకి చెప్ప లేనంత నిరాశ కలిగింది. ఉక్రోశం వచ్చింది. ఊరిలో దాదాపు అందరూ వారిని అప్పటికే దర్శించుకో గలిగారు. తన కొక్కడికే అతని దర్శన భాగ్యం దొరక లేదు.  దానితో వాడి కడుపు రగిలిపోయింది. తన కోపాన్ని యతీంద్రుల వారి మీదకే నెట్టి, నానా కారుకూతలూ మొదలు పెట్టాడు. ఒక వితండ వాదాన్ని ప్రారంభించాడు. ఊర్లో అందరితో వాదనకి దిగి, నోటికొచ్చి నట్టు వాగడం మొదలు పెట్టాడు.  ‘‘ నాలాంటి మహా భక్తుడు తనని చూడడానికి  వస్తున్నాడని కూడా తెలుసుకో లేక ఊరొదిలి వెళ్ళి పోయేడు !  అతనేం యతి ! అతనిదేం
మహిమ !  వట్టి దొంగ సన్యాసి ! మీరంతా అతడిని నమ్మి మోస పోయారు ..’’ అంటూ తెగ వాగడం మొదలు పెట్టాడు. తాము నమ్మిన మతీంద్రులను వాడు అలా దుర్భాషలు ఆడడం ఎవరికీ నచ్చ లేదు. కాదంటే తమనీ నోటికి వచ్చి నట్టు తివడతాడని అంతా నోరు మెదపకుండా ఉండి పోయేరు. వాడి నోటికి తాళం వేయడం లాగో ఎవరికీ తెలిసింది కాదు !
    చివరకి,  రామయ్య అనే ఒక తెలివైన కుర్రాడు ఒక రోజు  సోమయ్యతో ఇలా అన్నాడు :  ‘‘ ఊర్లో వృద్ధులూ, వికలాంగులూ, రోగ గ్రస్థులూ, ఇంకా నీ లాంటి మహా భక్తులూ మాత్రమే యతీంద్రుల వారిని దర్శించుకో లేక పోయేరు. అలాంటి వారందరికీ వారు ప్రత్యేకంగా వారి కలల లోకి వచ్చి , దర్శన మిస్తున్నారు !నేడో, రేపో మహా భక్తుడవైన నీకల లోకి కూడా వచ్చి కనబడతారు కాబోలు, అదీ,నీభక్తి నిజమైన దయితేను మాత్రమే సుమా ! నీది నిజమైన భక్తి అని ఊర్లో అందరికీ తెలుసు. నీ అంత గొప్ప భక్తుడు ఊళ్ళో మరొకడు లేడు ! అంచేత వారు తప్పకుండా నీ కలలోకి వచ్చి కనపబడతారు ... అసలు ఈ సరికే వారి దర్శనం నీకు కలలో జరిగే ఉంటుంది .. అవునా !  ఏమయినా, నీ అంత అదృష్ట వంతుడు
మన ఊళ్ళోనే కాదు, చుట్టు ప్రక్కల గ్రామాలలో కూడా ఎక్కడా లేడయ్యా ! భాగ్యశాలివి ! మాకా అదృష్టం లేదు ! ’’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు !
    సోమయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. కలలో యతీంద్రులు కనబడ లేదంటే , ఊరి వాళ్ళ ముందు తను మహా భక్తుడు కాకుండా పోతాడు !
     అంచేత,  ‘‘ అవునవును యతీంద్రుల వారు నాకు నిన్న రాత్రే కలలో కనిపించారు. చాలా సేపు మాట్లాడు కున్నాం కూడానూ ! ’’ అని బొంకాడు.
      ఆ తర్వాత వాడు మరింక యతీంద్రుల వారి గురించి అవాకులూ చెవాకులూ పలకడం మానీసేడు !
       వాడి నోటికి తాళం పడింది !!

15, సెప్టెంబర్ 2014, సోమవారం

భలే తీర్పు !


అనగా అనగా ఒక ఊరిలో ఒక జమీందారు ఉండే వాడు. అతని పేరు కృష్ణయ్య. ఊర్లో ఎవరికి ఏ తగవు వచ్చినా, రెండు పక్షాల వారి వాదనలనూ విని,  చక్కగా తీర్పు చెప్పే వాడు.  అతని తీర్పనకు ఎదురు ఉండేది కాదు ! కృష్ణయ్య చెప్పే తీర్పులు వినడానికి  గ్రామం లోని వారే కాకుండా, చుట్టు ప్రక్కల ఊర్లనుండీ జనం విరగబడి వచ్చే వారు ! అతను చెప్పిన తీర్పుల లోని సబవు గురించి రోజుల తరబడి మెచ్చుకుంటూ  మాట్లాడుకునే వారు.
    ఒక రోజు కృష్ణయ్య దగ్గరకు ఊర్లో ఉండే ఇద్దరు వ్యక్తులు వచ్చేరు.  వారిలో ఒకడి  పేరు రామయ్య. రెండో వాడు సోమయ్య.
    మందుగా రామయ్య తన గోడు ఇలా చెప్పు కున్నాడు : ‘‘అయ్యా ! నా పేరు రామయ్య. పెద్ద వీధిలో ఉంటాను. ఇతడు నా దగ్గర పని వాడు. పేరు సోమయ్య. ఇతనికి జీతం బాగానే ముట్ట చెబుతున్నాను. తిండీ బట్టా ఇస్తున్నాను. చక్కగా చూసు కుంటున్నాను.కానీ, ఇతడి బుద్ధి మంచిది కాదు. మొదట్టో బాగానే ఉండే వాడు కానీ, ఇటీవలే మారి పోయాడు. నాకు అనుమానం కలిగి, ఇతని బుద్ధి తెలుసు కోవాలను కున్నాను.
   నిన్న ఉదయం మా ఇంటి గదిలో అందరికీ కనబడే లాగున ఓ వెండి భరిణె ఉంచాను. తలుపు చాటు నుండి చూస్తున్నాను.వీడు అటూ, యిటూ దొంగ చూపులు చూస్తూ ఉండడం గమనించాను. వీడు ఆ వెండి భరిణెని తటాలున తీసి పంచె చాటున దాచేసుకుని ఏమీ ఎరగనట్టు వీధి లోకి వెళ్ళి పోబోతూ ఉంటే పట్టు కున్నాను. వీడు బిగ్గరగా ఏడుస్తూ తన తప్పు ఒప్పు కున్నాడు. వెంటనే పని లోనుండి తీసి వేసాను. వీడు మాత్రం తన తప్పును అంగీకరిస్తూనే, తనని పని లోనుండి మాత్రం తీసెయ్య వద్దని జలగ లాగా పట్టు కుని వదలడం లేదు !
వీడి బుద్ధి బయట పడ్డాక కూడా వీడిని పనిలో ఎలా పెట్టు కోగలను తమరే తీర్పు చెప్పండి ! ’’ అన్నాడు.
    సోమయ్య తను వెండి భరిణె దొంగతనం చేసి నటట్టుగా అంగీకరించేడు.  లోగడ ఎప్పుడూ అలాంటి దొంగ పనులు చేయ లేదని ఏడుస్తూ చెపాడు. అదే మొదటి సారి అనీ, తన సంపాదన చాలక పోవడంతో  ఇంటి దగ్గర పరిస్థితులు చాలా  దారుణంగా ఉన్నాయని ఏడుస్తూ  ఇలా చెప్పాడు.. ‘‘ఆ సమయంలో  నా బాధలన్నీ గుర్తుకు వచ్చి. అనుకోకుండా  వెండి భరిణె కనబడడంతో మనసు కట్టుకో లేక దానిని దొంగిలించాను. తప్పయింది. కనికరించండి.. ఇప్పుడు రామయ్య గారు నన్ను పని లోనుండి తీసేస్తే మా కుటుంబానికి ఆత్మ హత్యలు చేసు కోవడం తప్ప మరో దారి లేదు !’’ అంటూ లబో దిబో మన్నాడు.
    కృష్ణయ్య కాస్సేపు ఆలోచించి ఇలా తీర్పు చెప్పాడు :  ‘‘ఎలా చేసినా, ఎందుకు చేసినా, సోమయ్య దొంగ తనం చేసాడు కనుక అతనికి వంద కొరడా దెబ్బలు శిక్ష వేస్తున్నాను. ఇక,  సోమయ్య లేమి తనం తెలిసి కూడా అతని బలహీనతనకి పరీక్ష పెట్టినందుకు రామయ్యని కూడా శిక్షించక తప్పదు !నేరం చేయడం ఎంత తప్పో, నేరానికి ఏదో విధంగా ప్రేరే పించడమూ అంతే నేరం.
   అందు చేత, రామయ్యకి శిక్ష. అదేమిటంటే, అతడు సోమయ్యని తిరిగి పనిలో పెట్టు కోవాలి.అంతే కాదు , ఇక నుండీ అతనికి ఇచ్చే జీతాన్ని, కూడూ గుడ్డలను కూడా  రెట్టింపు చేయాలి.  ఇదే అతనికి సరైన శిక్ష ! ’’ అని తీర్పు చెప్పాడు.
  చుట్టూ ఉన్న జనం ఆ తీర్పు విని ‘‘ భలే ! చాలా బాగుంది ! ’’ అని
మెచ్చు కున్నారు !

14, సెప్టెంబర్ 2014, ఆదివారం

ప్రాణ భయం ... వింత జంతువు


అనగా అనగా ఒక అడవిలో చాలా రకాలయిన జంతువులూ,పక్షులూ హాయిగా నివశిస్తూ ఉండేవి. ఇలా ఉండగా ఒక రోజు ఎక్కడి నుండో ఒక వింత జంతువు ఆ అడవిలోకి ప్రవేశించింది.అలాంటి వింత జంతువును ఆఅడవిలో జంతువులు కానీ, పక్షులు కానీ మునుపెన్నడూ చూసి ఉండ లేదు ! ఆ వింత జంతువు కూడా అంతకు ముందు ఏనుగు వంటి భారీ శరీరం గల జంతువును కానీ, సింహం వంటి భీకర మయిన ఆరాన్ని కానీ, పులి లాగ వేగంగా పరిగెత్త గల జంతువుని కానీ, చూసి ఉండ లేదు.అలాగే కోకిల వలె కమ్మ నయిన కంఠం ఉన్న పక్షిని కానీ, చిలుక లాంటి అందమయిన రూపం గల దాన్ని కానీ, నెమలి లాగ వయ్యారాలు పోతూ నాట్యం చేసే దానిని కానీ అంతకు  ముందెప్పుడూ చూడ లేదు !ఎక్కడో ఎడారి ప్రాంతం నుండి వచ్చిన ఆ వింత జంతువుకి  ఈ మైదానం ప్రాంతం లోని జంతువులూ, పక్షులూ ఇలా హాయిగా జీవిస్తూ ఉండడం చూసి అసూయ కలిగింది. దాని కడుపు  రగిలి పోయింది. అడవిలో ప్రతి జంతువుకీ ఏవో కొన్ని చక్కని ప్రత్యేకతలు ఉండడం గమనించింది. ఏ ప్రత్యేకతలూ లేకుండా తన ఆకారం వెగటు పుట్టేలా ఉండడం తలచుకుని అది అసూయతో  కుంగి పోయింది.  ఎలాగయినా అడవికి తానే రాజయి, వాటి మీద పెత్తనం  చెలాయించాలనుకుంది.
    వెంటనే అడవి జంతువులనీ, పక్షులనీ సమావేశ పరచి ,వాటితో ఇలా అంది :  ‘‘నేను చాలా దూర ప్రాంతాల నుండి వచ్చాను.  దాదాపు దేవ లోకానికి దగ్గర నుండి అన్న మాట ! అక్కడ మంచు కొండల్లో మహా ఋషులు తపస్సులు చేసు కుంటూ ఉంటారు. నేను చిర కాలం వారికి సేవలు చేసుకుని, వారి నుండి కొన్ని గొప్ప  శక్తులు పొందాను.మీ అడవి జంతువుల లోనూ , పక్షుల లోనూ లేని  ఒక ప్రత్యేకత నాలో ఉంది ! నేను భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఇట్టే చెప్ప గలను ! కొద్ది రోజులలో  ఒక మహా ప్రళయం ముంచుకు రాబోతోంది. అది ఈ అడవిని మొత్తం నాశనం చేయబోతోంది.  ఆప్రళయం నుండి అందరినీ కాపాడే శక్తి నాకు ఒక్క దానికే ఉంది ! అదీ కాక, ఆ మహా ప్రళయం వచ్చి, ముందుగా ఈ అడవికి రాజునీ, తర్వాత తక్కిన వారినీ కబళించి వేస్తుంది. ఈ అడవికి రాజు  దుర్బుడైతే మొత్తం అందరికీ ప్రమాదమే. మీ రాజుకి ఆ మహా ప్రళయాన్ని ఎదుర్కొనే శక్తి లేనట్టు అనిపిస్తోంది. ఉంటే సంతోషమే. మీ మంచి కోరి చెబు తున్నాను.  మీరే ఆలోచించి ఏ విషయమూ తేల్చు కోండి. నేనయితే మాత్రం మిమ్మల్ని ఆ మహా ప్రళయం నుండి కాపాడ గలను ! నన్ను కూడా నేను కాపాడు కోగలను !
మీ అందరినీ చూస్తూ ఉంటే నాకు ముచ్చట వేస్తోంది. అన్యాయంగా బలై పోకూడదని ఇంతగా చెబుతున్నాను. ఆలోచించండి. కాదూ కూడదూ అంటే నేను తిరిగి మా  రా.జ్యానికి చక్కా పోతాను !’’ అంది.
     దాని మాటలు విని అడవికి రాజయిన సింహంతో పాటు తక్కిన జంతువులూ, పక్షులూ వజవజ వణికి పోయాయి. మరో దారి లేక ,అవన్నీ ఒక నిర్ణయానికొచ్చి, ఆ వింత జంతువుని ఇక నుండీ తమ అడవికి రాజుగా ఉండి, తమని ఎలాగయినా కాపాడ మని వేడుకున్నాయి.
   వింత జంతువు తన పాచిక పారి నందుకు సంతోషించి, అందుకు అంగీకరించింది.
ఆనాటి నుండీ అడవిలో జంతువు లన్నీ తమ రాజయిన ఆ వింత జంతువుకి రోజూ మూడు పూటలా కావలసినత ఆహారం, నీరు సమకూర్చి పెట్టసాగేయి. దానిని భయ భక్తులతో సేవించడం మొదలు పెట్టాయి. రాజు కనున, దాని అందాన్నీ, సుగుణాలనూ తెగ పొగడడం ప్రారంభించేయి ! వింత జంతువు అడవిలో రాజ భోగాలు అనుభవించ సాగింది ! దానితో దానికి గర్వం ఎక్కువయింది ! అడవి జంతువులని నానా రకాలుగా పీడించడం మొదలు పెట్టింది.  తనకి నచ్చిన జంతువుని  రోజు కొకటి చొప్పున చంపి తినేది.
      కొద్ది కాలం లోనే అడవి జంతువు లన్నీ, అది తమని మోసం చేసిందని గ్రహించాయి.  ఎలాగయినా, అడవి నుండి ఆ వింత జంతువుని  తరిమేయాలని రహస్యంగా సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఒక  వృద్ధ జంబుకం
( ముసలి నక్క ) ఆ బాధ్యత తీసుకుంది !
    అది ఒక రోజు ఆ వింత జంతువు దగ్గరకి వచ్చి, వినయంగా చేతులు కట్టుకుని ఇలా అంది :  ‘‘రాజా ! మీరు మహా ఙ్ఞానులు ! మీరు చెప్పిన భవిష్య వాక్కు ఫలించ బోతోంది! తీతువు దూర ప్రాంతాలకి ఎగిరి వచ్చి ఇప్పుడే ఆ సంగతి చెప్పింది. మీరన్నట్టుగా ఆ మహా ప్రళయం వచ్చేస్తోంది ! ఎంతో దూరంలో లేదుట ! మీరన్నట్టే, అది, ముందుగా ఈ అడవికి రాజునీ, తర్వాత మిగతా జంతువులనీ చంపి తినేస్తానని దిక్కులు పగేలా అరుస్తూ వస్తోందిట ! మరిప్పుడు తమరు  దానిని ఎదర్కొనే సమయం వచ్చింది ! ఎలాగయినా దానిని చంపి, మమ్మల్ని కాపాడండి ’’ అంది దీనంగా ముఖం పెట్టి.
   దాని మాటలు వింటూనే వింత జంతువు ముఖంలో రంగులు మారి పోయేయి ! భయంతో దానికి ముచ్చెమటలు పట్టాయి. అడవి జంతువులని వంచంచడానికి తాను చేసిన కల్పనే ఇప్పుడు నిజం కాబోతోంది కాబోలు అని అది నమ్మింది.
   ఫ్రాణ భయంతో ముందూ వెనుకా చూడ కుండా అడవి వదిలి పారి పోయింది !
   మరెప్పుడూ ఆ దరిదాపులకి కూడా రాలేదు !
   అప్పటి నుండి అడవి జంతువులు ఎప్పటి లాగే హాయిగా జీవించ సాగేయి ! 

11, సెప్టెంబర్ 2014, గురువారం

కుందేలు త్యాగం !


ఒక మండు వేసవి కాలంలో అడవి జంతువులన్నీ ఎక్కడా త్రాగడానికి చుక్క నీరు లేక, విలవిలలాడి పోయాయి.గుక్కెడు నీళ్ళ కోసం అవి , అడివంతా జల్లెడ వేసి గాలించాయి.ఎక్కడా చుక్క నీళ్ళు కనిపించ లేదు ! అడవి జంతువులలో కాస్త వయసు పైబడ్డ  పెద్ద జంతువులు బాధగా ఇలా అన్నాయి : ‘‘పుట్టి బుద్ధెరిగి,ఇంతటి దారుణమైన వేసవి కాలాన్ని ఎప్పుడూ చూడ లేదు! ’’ అని.
     జంతువులన్నీ నీళ్ళ కోసం వెతుకుతూ అడవి సరిహద్దులు విడిచి, చివరకి గ్రామాల మీద పడ్డాయి. గ్రామ ప్రజల చేతిలో చావుని కొని తెచ్చు టున్నాయి.రోజు రోజుకీ నీళ్ళ కోసం ఊళ్ళ మీద పడిన జంతువులు ఒక్కొక్క టీ జనాల చేతికి చిక్కి మరణిస్తున్నాయి. అడవి జంతువులకి ఏం చేయాలో తోచ లేదు.
     ఒక రోజు జంతువులన్నీ అడవిలో ఒక చోట  సమావేశ మయ్యాయి. తమలో తాము ఇలా చర్చించు కున్నాయి :
      ‘‘ మనందరికీ చావు మూడినట్టుగా ఉంది.నీరు లేక పోతే బ్రతకలేం కదా !
నీటి కోసం గ్రామాల మీద పడిన వాళ్ళలో ,మనవాళ్ళు ఇప్పటికే చావు కొని తెచ్చు కున్నారు. ఇక ఇక్కడ ఉండ లేం  బాబూ !   అలా అని, అడవిని విడిచి ఎక్కడికీ వెళ్ళ లేం !  ఏం చేయాలో తోచడం లేదు !’’ అంది పులి విచారంగా.
    తక్కిన జంతువులన్నీ అవునంటే అవునని పెద్ద పెట్టున ఏడవడం మొదలు పెట్టాయి.
    ‘‘ మన పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది కనుక, ఇక మనం అందరం కలసి ఒకే సారి ఆత్మ హత్యలు చేసు కోవడం మంచిదని నాకు అనిపిస్తోంది ..’’ అంది ఏనుగు.
    ఒక్క కుందేలు తప్ప,  తతిమ్మా జంతువులన్నీ అలా చేయడం తప్ప మరో దారి లేదంటూ అంగీకరించాయి. ఏక కంఠంతో హాహాకారాలు చేసాయి. వాటి ఏడుపులతో అడవి దద్దరిల్లి పోయింది !
      ఇంతలో కుందేలు తల పైకెత్తి ,  ఆకాశం వంక చూసింది.
       ఆకాశం లోకి చూస్తూ అంది : ‘‘ ఆగండాగండి ! మీ ఏడుపులు ఆపండి !
అదిగో !ఆకాశంలోమబ్బు తునక కనబడుతోంది !ఎప్పుడు కురుస్తుందో
 అడుగుదాం ..’’  అని అరిచింది.
       అడవి జంతవులన్నీ దుఃఖం దిగమ్రింగుకుని, తలలు పైకెత్తి ఆకాశం లోకి చూసాయి. అక్కడో చిన్న మబ్బు తునక వాటికి కనిపించింది.
   ‘‘ మబ్బు తునకా ! మబ్బుతునకా !  మా అడవిలో ఎప్పుడు కురుస్తావో
చెప్పవూ ?!’’ దీనంగా అడిగింది జింక.
‘‘ అయ్యో ! కురిసేటంత శక్తి నాకు లేదు ! నేను వొట్టి తెల్ల మబ్బును.నాతో నీటిని తెచ్చు కోలేదు.మరి, నేనెలా కురవ గలనూ ? నేను వెళ్ళి, మా కర్రి మబ్బు అన్నతో మీరు పడుతున్న కష్టాల గురించి చెబుతాను. అతను వచ్చి, మీకు కావలసినంత నీటిని కురిపిస్తాడు లెండి !’’ అంది మబ్బు తునక. అని భరోసా ఇచ్చి , అక్కడి నుండి కదలి పోయింది.
    మబ్బు తునక వెళ్ళి చాలా రోజులయినా, కర్రి మబ్బు వచ్చే జాడ కనిపించ లేదు. అడవి జంతువులన్నీ ఆందోళన పడసాగేయి. ఆశ వదులు కున్నాయి.
‘‘ ఇక మన చావు ఖాయం. మబ్బు తునక మనల్ని మోసం చేసింది. చచ్చే వాళ్ళని చావనివ్వకుండా , మనం మరిన్ని రోజులు బతికేలా చేసింది. కష్టాలు అనుభవించేలా చేసింది. మనకింక వాన కోసం ఎదురు చూసే ఓపిక లేదు !
ఈ మబ్బులని నమ్మ లేం !  ఇక మనకు సామూహిక ఆత్మ హత్యలే గతి !’’ అనుకున్నాయి. ఆత్మ మత్యలు చేసు కోడానికి సిద్ధ సడ్డాయి.
   కుందేలు వారించింది : ‘‘సరే, నాకు ఆఖరి అవకాశం ఇవ్వండి ...నేను దూర ప్రాంతాలకు వెళ్ళి, కర్రి మబ్బు వస్తోందేమో చూసి వస్తాను ... అయితే, నేను తిరిగి వచ్చే వరకూ మీరు ఎలాంటి అఘాయిత్యాలకూ పాల్పడమని నాకు మాట ఇవ్వండి.’’ అంది. ఎలాగో అతి కష్టం మీద వాటిని  ఆత్మ హత్యలు చేసుకో కుండా కుండా ఆపగలిగింది.
   అడవి జంతువులన్నీ వంతుల వారీగా నీటి కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటూ దగ్గర లోని గ్రామాలకు వెళ్ళి రాసాగేయి.
    కుందేలు వెళ్ళి చాలా రోజులు గడిచాయి. అడవి జంతువుల కష్టాలు నానాటికీ ఎక్కవయింది. ఒక ప్రక్క నీటికి కటకట. బతకడం దుర్భరమైపోతోంది. చద్దామంటే, తను తిరిగొచ్చే వరకూ ఆత్మ హత్యలు చేసుకో వద్దని కుందేలు తమ వద్ద మాట తీసుకుందాయె !  ఏం చేలాలో వాటికి తోచ లేదు.
   అలాగే ప్రాణాలు ఉగ్గ బెట్టుకుని రోజులు వెళ్ళ దీసాయి.
    కుందేలు రాక కోసం కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూడసాగేయి.
     అది వస్తుందన్న ఆశ నానాటికీ సడలి పోతోంది.
      కానీ , అదొచ్చే వరకూ ఎదురు చూడడం తప్ప మరో మార్గం లేదు !
       ఇలా ఉండగా,  వానా కాలం రానే వచ్చింది.
        ఎక్కడి నుండో  కర్రి మబ్బులు కమ్ముకుని వచ్చి, చాలా రోజుల తరువాత అడవిలో విస్తారంగా వానలు కురిపించాయి !  అడవి జంతువుల ఆనందం అంతా ఇంతా కాదు ! తమ ఆపద అలా గట్టెక్కాక, అవి హమ్మయ్య అనుకుని, ఇక కుందేలు రాక కోసం ఆత్రంగా ఎదురు చూడ సాగేయి.
      చిన్ని కుందేలు మాత్రం అక్కడికి మరింక తిరిగి రాలేదు !
      ఏమై పోయిందో ఎవరికీ తెలియదు.
       వేసవి గడచి, మళ్ళీ వర్షా కాలం వచ్చే వరకూ, ఆశ కల్పించి, తమని బ్రతికిండం కోసమే  అది తన ప్రియమైన అడవిని వదిలి ఎక్కడికో వెళ్ళి పోయిందని వాటికి తెలియదు !!!                     

10, సెప్టెంబర్ 2014, బుధవారం

దేవుడ్ని చూసిన వాడు !


నంది వర్ధన పురంలో గంగాధరుడనే కుర్రాడు ఉండే వాడు, వాడికి ఓ ముసలి అవ్వ తప్పితే వెనుకా ముందూ ఎవరూ లేరు.బడికి పోయే వాడు కాదు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండే వాడు.అర్ధం పర్ధంలేని ప్రశ్నలు అడుగుతూ అందరినీ విసిగిస్తూ ఉండే వాడు. వాడు వేసే తలా తోకా లేని ప్రశ్నలకి ఊళ్ళో అందరూ విసిగి పోయి, వాడంటేనే చిరాకు పడే వారు. 
      రామయ్య అనే ఒక ముసలి రైతుకి మాత్రం వాడంటే ఇష్టం.  అమ్మా నాన్నా లేని పిల్లాడని వాడంటే  అమితమైన జాలి చూపిస్తూ ఉండే వాడు. వాడిని ఎలాగయినా ఓ దారికి తీసుకుని రావాలని రామయ్యకి కోరికగా ఉండేది. కానీ గంగాధరుడు మాత్రం రామయ్య మాటని పెడ చెవిని పెట్టే వాడు.
    ఒక రోజు రామయ్య తన పొలంలో పని చేసుకుంటూ ఉండగా, గంగాధరుడు అక్కడికి వచ్చేడు. వస్తూనే, ‘‘ తాతా ! అంతలా అలసి పోతూ పని చేయక పోతే ఏం !’’ అంటూ తన సహజ ధోణిలో అడిగాడు.దానికి రామయ్య  ‘‘ మంచి వాడివే !
పొలం దున్నాలి .. ఎరువులు వేయాలి ... విత్తాలి ... కలుపు తీయాలి .. కోతలు కోయాలి ... కుప్పలు కూర్చాలి ... వడ్లు దంచాలి ... అన్నం వండాలి ...ఇంత చేస్తేనే కదా, నోటికి అన్నం ముద్ద దక్కేది. ఊరికే కూర్చుంటే ఎలాగురా ! నీలా తిని  బలాదూరుగా తిరిగితే నోట్లో మట్టేరా, నాయనా !’’ అన్నాడు.
‘‘ అబ్బో, చాలా తతంగం ఉందే ! కష్ట పడకుండా తిండి దొరికే మార్గం ఏదీ లేదంటావా  తాతా? ’’ అనడిగేడు గంగాధరుడు.
‘‘ నాకయితే తెలియదు కానీ, దూరన ఉండే  ఆ గుడిలో శివయ్య ఉన్నాడు కదా, .. అతనేమయినా చెబుతాడేమో కనుక్కో ! కనుక్కుని వచ్చేక అతడు ఏమన్నదీ నాతో తిరిగి చెప్పాలి సుమా !’’ అన్నాడు రామయ్య.
   కష్ట పడకుండా తిండి దొరికే మార్గం గుడిలో శివయ్య చెబుతాడని ఆశతో ఆనందంగా గుడి వేపు పరుగు తీసాడు గంగాధరుడు. గుడిలో  ఉలుకూ పలుకూ లేని శివ లింగాన్ని చూసేక వాడి ఆనందం నీరు కారి పోయింది. వెంటనే పరుగు పరుగున తిరిగి రామయ్య దగ్గరకి వచ్చి, ‘‘నువ్వు నాకు అన్నీ అబద్ధాలే చెప్పావు! గుడిలో లింగమే తప్ప, శివయ్య లేడు. ’’ అన్నాడు కోపంగా.
     అందుకు రామయ్య నవ్వి, ‘‘ అదేమిటి ! శివయ్య అక్కడే ఉన్నాడట కదా !
నువ్వు వచ్చి ఏమీ అడగకుండానే వెళ్ళి పోయావని నాతో చెప్పాడు కూడానూ !’’ అన్నాడు.  ఆ మాటలతో గంగాధరుడికి ఉడుకుమోతు తనం వచ్చింది. మళ్ళీ  అంత దూరమూ ఆయాస పడుతూ గుడికి పరిగెత్తాడు. ఈ సారి కూడా వాడికి శివయ్య కనిపించ లేదు ! ఎంత పిలిచినా పలక లేదు ! దానితో తిరిగి ఆయాస పడుతూ రామయ్య దగ్గరకి వచ్చేడు.  ‘‘ నీవన్నీ ఉత్త మాటలు ! గుడిలో శివయ్య లేనే లేడు ! నీకు కనిపించిన వాడు నాకెందుకు కనిపించడు ?’’ అన్నాడు కోపంగా.
    దానికి రామయ్య నవ్వుతూ ‘‘నేను పొద్దుటి నుండీ పొలంలో వంచిన నడుం ఎత్తకుండా పని చేస్తున్నాను. నువ్వు ఏ పనీ చేయడం లేదు. కష్ట పడి పని చేసే వాళ్ళంటేనే శివయ్యకి ఇష్టం కాబోలు ! అందుకే, నాకు కనిపించిన వాడు నీకు కనిపించడం లేదు ! ’’ అన్నాడు.
    ఆ మాటలు గంగాధరుడి మీద బాగా పని చేసాయి. ఆ రోజు నుండీ వాడిలో చాలా మార్పు వచ్చింది. ఒళ్ళు వంచి పని చేయ సాగేడు.బడికి వెళ్ళి, శ్రద్ధగా చదువు కోవడం మొదలు పెట్టాడు. త్వరలోనే ఊళ్ళో అందరి దగ్గరా  గంగాధరుడు బుద్ధి మంతుడనే పేరు తెచ్చు కున్నాడు !
     ఆ తర్వాత ఓ రోజు రామయ్య గంగాధరుడు కనబడితే అడిగాడు ‘‘ ఇంతకీ నీకు శివయ్య ఇప్పటికయినా కనిపించేడూ ?!’’ అని.
    దానికి గంగాధరుడు  ‘‘లేదు కానీ తాతాతాతా ! శ్రమలోనే దేవుడున్నాడని తెలిసింది. శ్రమించే వారికీ, పేదలకి సాయం చేసే వారికీ ఆ శివయ్య వెన్నంటే ఉంటాడని తెలిసింది !’’ అన్నాడు తను కూడా నవ్వుతూ.
      దానికి రామయ్య - 
    ‘‘ ఇప్పుడు నచ్చేవురా! భడవా, ఏదీ ఒక ముద్దియ్యి ! ’’ అన్నాడు !

9, సెప్టెంబర్ 2014, మంగళవారం

ఒక్క నిముషం !


రాముడు బుద్ధిమంతుడే కానీ,కొంచెం పెంకెతనం ఎక్కువ ! చెప్పిన పని వెంటనే చెయ్యడు.అది మంచి పద్ధతి కాదని త్లీ తండ్రీ ఎంత చెప్పినా వాడి చెవికెక్క లేదు.
ఏ పని చేయమని పురమాయించినా, ‘‘ఇదిగో ఒక్క నిముషం .. కాస్సేపాగి చేస్తాను కదా ! అనే వాడు. తరవాత ఆ పని చేయడం మరిచి పోయే వాడు. దానితో ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉండే వారు.వాడినెలా దారిలోకి తేవాలో తెలియక వాడి అమ్మా నాన్నలు తలలు పట్టుకునే వారు.
    ఇలా ఉండగా, ఒక రోజున వాడి తాత గారు గ్రామం నుండి మనవడిని చూసి పోదామని వచ్చేరు.  వచ్చిన రెండు మూడు రోజులకే మనవడి తీరు గమనించారు.ఎలాగయినా, వాడి బద్ధకాన్ని వదిలించాలనుకున్నారు.మాటలతో చెబితే వినేరకం కాదని, కథలు చెప్పే నెపం మీద వాడిలో మార్పు తేవాలనుకున్నారు.   ఎలాంటి పిల్లలయినా కథలంటే చెవి కోసుకుంటారు కదా !
    ‘‘ మనవడా !నాకు మంచి కథలు బోలెడు వచ్చు ... తెలుసా ! రోజూ నా భోజనం కాగానే నా మంచం దగ్గరకి రా ! నీకు ఆ కథలన్నీ చక్కగా చెబుతాను.
అయితే,  నేను నిద్ర పోక ముందే రావాలి సుమా ! పడుకుంటే నేను మరి లేవను గాక లేవను!  నువ్వు రావడం ఒక్క నిముషం లేటయినా, ఆ రోజు ఇక నీకు కథ లేనట్టే ! గుర్తుంచుకో ! ’’అని  ఆ రోజు దయమే మనవడికి చెప్పారు.
   ఆ రోజు బళ్ళో తోటి స్సేహితులందరికీ ఈ విషయమే గొప్పగా చెప్పాడు రాముడు. తాత చెప్పే కథలను రోజూ వారికి చెబుతానని  గొప్పలు పోయాడు.
    కథలంటే పడి చచ్చే రాముడు రాత్రి వేళ తాత గారి మంచం దగ్గరకి చేరే వాడు. కానీ , వాడికి ఏ పనైనా ఆలస్యం చేసే అలవాటు ఉంది కదా !  ఆ అలవాటు కొద్దీ  ఆ రాత్రి వేళ ఆలస్యంగా తాత గారి దగ్గరకు కథ చెప్పంచు కోడానికి చేరాడు.
‘‘ తాతా, కథ చెప్పవూ ?’’ అనడిగేడు. కానీ తాత గారు ‘‘ మనవడా ! భోజనం చేసి పడుకోబోతున్నాను ... నిద్ర ముంచుకు వస్తోంది. నీ కోసం ఎంత సేపటి నుండీ చూస్తున్నానో తెలుసా ! ఇప్పుడా, రావడం ! ఒక్క నిముషం ముందొచ్చినా బాగుండేది ... మరిప్పుడు కథా లేదు, కాకరకాయా లేదు !  పోయి పడుకో !’’ అని ముసుగు తన్నేశారు !  రాముడు నిరాశగా తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు.
      మర్నాడు బడిలో తాత చెప్పిన కథేమిటని అడిగిన స్నేహితుల ముందు రాముడు తెల్ల ముఖం వేసాడు. అందరూ‘‘ రాముడు అబద్ధాల కోరు!’’ అని గేలి చేసారు. రాముడు చిన్న బుచ్చుకున్నాడు. మర్నాడు తప్పకుండా తాత గారి చేత కథ చెప్పించుకుని, దానిని అందరికీ చెబుతానని పౌరుషంగా ప్రతిఙ్ఞ చేసాడు రాముడు.
    కానయితే, వాడి సహజ సిద్ధమయిన బద్ధకం వల్ల ఆ రోజు రాత్రి కూడా తాత గారు నిద్ర పోకుండా తాత గారి మంచం దగ్గరకి చేర లేక పోయేడు. తాత గారిని తట్టి లేపి ,తప్పయి పోయిందని ఎంత బ్రతిమాలినా, తాత గారు ముసుగు తీయలేదు. ఆ మర్నాడు కూడా బడిలో రాముడికి స్నేహితుల ముదు  అవమానం తప్ప లేదు. ఇలా నాలుగయిదు రోజులు గడిచాయి. తాత గారు తనకి చెప్ప బోయే కథలు వారికి చెబుతానంటూ స్నేహితు దగ్గర గప్పాలు కొడుతున్న రాముడు, కథ చెప్పమంటే బిక్క ముఖం వేస్తూ ఉండడంతో మిత్రులంతా వాడిని ఆటపట్టించడం మొదలు పెట్టారు. దానితో వాడికి పట్టుదల పెరిగింది. తన తప్పు తెలుసుకున్నాడు.
     తాత గారి భోజనం అయీ అవడంతోనే అతని మంచం దగ్గరకి చేరడం మొదలు పెట్టాడు. వాడిలో వచ్చిన మార్పునకు సంతోషించి తాత గారు వాడికి మంచి మంచి కథలు రోజూ రాత్రిళ్ళు చెప్పే వారు.
     వాటిని రాముడు బడిలో తన స్నేహితులకి చెప్పి, వారి మెప్పు పొందే వాడు.
      ఈ విధంగా రాముడికి అప్పటి నుండీ చక్కని సమయపాలన

       ఇప్పుడు రాముడు నిజంగానే బుద్ధిమంతుడు !

7, సెప్టెంబర్ 2014, ఆదివారం

మరుగుజ్జుల రాజ్యంలో మహా రాజు దిగులు



   మరుగుజ్జుల రాజ్యంలో మహా మంత్రి రాజు కన్నా బెత్తెడు పొడుగు.  
    రాజు అది సహించ లేక పోయే వాడు. మహా మంత్రి తన కన్నా పొడుగ్గా ఉండడం రాజుకి నచ్చేది కాదు ! అదతనికి అవమానకరంగా తోచేది. లోపల పలే అసూయతో కుమిలి పోతూ ఉండే వాడు.మహా మంత్రిని ఆ  ఆ పదవి నుండి తొలిగించాలని అనుకున్నాడు. అయితే, తాత ముత్తాతల కాలం నుండీ తమ రాజ్యానికి మహా మంత్రిగా  అతనే ఉంటూ ఉండడంతో , ఏ కారణమూ లేకుండా తీసెయ్యడం ఎలాగో రాజుకి తెలియ లేదు. 
   మరుగుజ్జుల రాజ్యంలో ప్రజలు మాత్రం అంగుష్ఠ మాత్రులు. అంటే, చేతి బొటన వ్రేలంత వారన్నమాట ! మహా మంత్రి  మాత్రం తనకన్నా పొడుగ్గా ఉండడం సహించ లేని రాజుకి రోజు రోజుకీ దిగులు ఎక్కువ కాసాగింది. ఆ దిగులుతో రాజు నానాటికీ చిక్కి పోసాగేడు. ఆరోగ్యం క్షీణించి పోసాగింది.రాజు రాను రాను ఎందుకంత దిగులుతో కుమిలి పోతున్నాడో ఎవరికీ అర్ధం కావడం లేదు.
.రాజ వైద్యులు రకరకాలచికిత్సలు చేసి చూసారు. కానీ ఫలితం లేక పోయింది. విదూషకులు కూడా రాజుని రకరకాలుగా నవ్వించి ఉత్సాహ పరచాలని ఎంతగానో ప్రయత్నించే వారు. కానీ ప్రయోజనం లేకపోయింది.  దిగులుతో రాజు రాజ్య పాలన సరిగ్గా చేయ లేక పోతూ ఉండే వాడు. రాజ్యంలో పరి పాలన కుంటు పడింది. కరువు కాటకాలూ, అరాచకమూ ఎక్కువ కాసాగింది.
   అంతే కాకుండా , రాజు గారి తీరు మరీ ఆశ్చర్యకరంగా తయారయింది. ఎప్పుడూ తన ఎత్తయిన గద్దె నుండి ప్రజలు , పరివారం చూస్తూ ఉండగా దిగే వాడు కాడు. ఇతర మంత్రుల కన్నా కూడా నేలబారుగా ఉండే సింహాసనం వేయించి , దాని మీద కూర్చోమని మహా మంత్రిని ఆఙ్ఞాపించాడు.మహా మంత్రికి ఇది తీరని అవమానంగా తోచేది.అయినా, మౌనంగానే భరిస్తూ వచ్చేడు. రాజు గారి అంతరంగం అర్ధం కాక అంతా తలలు పట్టు కున్నారు.రాజు గారు రాచ నగరులో విహారం చేసేటప్పుడూ, వేటకి వెళ్ళినప్పుడూ కూడా మహా మంత్రిని తనకి చాలా వెనుకగా, దూరంగా నడవమని ఆదేశించాడు. క్రమేపీ మహా మంత్రికి రాజు పడుతున్నఅవస్థ అర్ధమయింది.
    ఇలా ఉండగా , ఒక రోజు రాజు పరివారంతో వేటకి బయలు దేరాడు. యథా ప్రకారంగా మహా మంత్రి రాజుకి చాలా వెనుకగా నడవసాగేడు. వేట జరుగుతోంది. అలా సాయంత్రమయింది. మహా మంత్రి తన కంటె బాగా వెనక పడి పోవడాన్ని తనివితీరా చూడాలని రాజు ఒక చోట ఆగి వెనుతిరిగి  చూసాడు. చాలా వెనుక, అక్కడ మహా మంత్రి ఒక కర్రతో తన నీడను తానే కొడుతూ ఉండడం కనిపించింది  రాజుకి ఆశ్చర్యం కలిగింది. మహా మంత్రికి మతి కానీ చలించిందా ! అనుకున్నాడు.అతని చర్యకు కారణ మేమిటని బిగ్గరగా అరచి అడిగాడు.
        దానికి మహా మంత్రి ఇలా జవాబు చెప్పాడు : ‘‘ ప్రభువులుమన్నించాలి ! ఈ సాయంకాలపు నీరెండ చూడండి ... నాతో ఎప్పటికీ సాటి రాలేని నా నీడఎంత పొడుగ్గా ఉందో ? ! అందుకే దాని పొగరు అణచడానికి దండిస్తున్నాను ! ’’ అన్నాడు.
     ‘‘ మీ నీడే కదా !దానినెందుకూ దండించడం !’’ అనడిగేడు రాజు ఆశ్చర్యపోతూ.
దానికి మహా మంత్రి ‘‘ అవును ప్రభూ ! ఈ సాయంకాలపు నీరెండ నా ముందు నాకంటె పొడుగ్గా ఉండడం నేను ఎలా సహించ గలను చెప్పిండి ...నాకది తీరని అవమానం కాదా ? ఏలిన వారు దయతో ఆలోచించాలి ..’’ అన్నాడు.
   రాజుకి మహా మంత్రి ఏమి చెప్పదలచు కున్నాడో గతమయింది.
సాయంకాలపు నీరెండ ఉడిగి పోతున్న వయసుకి ఆనవాలుగా రాజుకి తోచింది.నీడ ఎలా ఉన్నప్పటికీ, అది మనిషికి సాటి రాలేదు.
   మహా మంత్రి పట్ల తన వైఖరికి రాజుకి సిగ్గు కలిగింది. రాజు అప్పటి నుండి తన మనసు మార్చు కున్నాడు. మహా మంత్రిని తగు విధంగా గౌరవించడం మొదలు పెట్టాడు.
    రాజు మనసుకుదుట పడింది..
     అప్పటి నుండి రాజ్యమూ తిరిగి కళకళలాడింది !

3, సెప్టెంబర్ 2014, బుధవారం

తిక్కలోడి కథ !



వాడి అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు, అందరూ వాడిని తిక్కలోడనే పిలుస్తారు.వాడికి ఇరవై యేళ్ళొచ్చినా, వాడికింకా స్థిరత్వం ఏర్పడ లేదు. జులాయిగా తిరగడం. ఎవరేం చెప్పినా దానికి వ్యతిరేకంగా మాట్లాడడం. ఇదీ వాడి వరస !ఎడ్డెమంటే, తెడ్డెమనే రకం అన్నమాట.అవునంటే కాదనీ, కాదంటే అవుననీ వాదించడం వాడి అలవాటు. వాడి మంకుతనం చూసి, అందరూ విసిగి పోయారు.ఎవరేం చెప్పినా వినిపించుకునే వాడు కాదు.  తనకు తెలిసినా, పంతం కోసం తిక్కగా వాదించే వాడు.అదంటే ఇదనీ, ఇదంటే అదనీ తెగ విసిగించే వాడు.
తల్లీ తండ్రీ చిన్నప్పుడే పోవడం చేత , అవ్వ దగ్గర పెరిగాడు. ముసిలావిడ కూడా వాడికి చాకిరీ చేయ లేక విసిగి పోతూ ఉండేది. వాడి వితండ వాదనతో ఆవిడకి నీరసం వొచ్చేది.
       అది వండితే, ఇది వండమని పేచీ పెట్టే వాడు.
        వాడు వండమన్నదే వండి పెడితే , మరోటి ఎందుకు వండ లేదని కంచం      విసిరి కొట్టే వాడు.
          అన్నం తిందువుగాని రారా అంటే, ఊళ్ళో తిరిగొస్తానని ఎక్కడికో వెళ్ళి పోయే వాడు.
           వంటింకా కాలేదు, అలా తిరిగిరా ,నాయనా ! అంటే, అన్నం వడ్డించమని పీకల మీద కూర్చునే వాడు !
             తిక్కలోడితో  వేగ లేక ఓ రోజు అవ్వ వాడితో ఇలా అంది : ‘‘ఒరే, తిక్కలోడా ! నీతో నేను మరింక వేగ లేను.కాశీకి పోతాను. మనింట్లో రెండు సీనా రేకు పెట్టెలు ఉన్నాయి కదా !ఒకటి ఎరుపు రంగుది. రెండోది. నలుపు రంగుది. వాటిలో ఒక దానిలో నాకున్న డబ్బూ దస్కం, నగా నట్రా దాచి ఉంచుతాను. వాటితో పాటు,  నాకున్న అరెకరం భూమి కాగితాలు కూడా దాచి ఉంచుతాను.  రెండింటికీ తాళాలు వేసి ఉంచుతాను. రేపు తెల్లారేక నువ్వు వాటిలో ఒక పెట్టెను ఎంచుకుని తెరువు. నువ్వు నగలూ, డబ్బూ, దస్తావేజులూ ఉన్న పెట్టెను ఎంచు కున్నావనుకో , ... ఆ మొత్తం ఆస్తిని నీకే వదిలి పెట్టి నేను కాశీ పోతాను. మరింక తిరిగి రాను. ఒక వేళ నువ్వు ఖాళీ పెట్టెను ఎంచు కున్నావనుకో !
నీ ఖర్మ ! నీకొక్క ఎర్ర ఏగాణీ దక్కకుండా అంతా నేను పట్టుకు పోతాను. అంతే ... నీ తిక్కలతో నేను   పడలేను మరి ! ’’ అంది.
     ఆ రాత్రి  - మరి తిక్కలోడికి నిద్ర పట్ట లేదు. తెల్లారేక పెట్టె తెరవమని చెప్పింది అవ్వ. కానీ ,తిక్కలోడు అంత దాకా ఆగ లేక సోయేడు. అర్ధ రాత్రి వేళ అవ్వ పడుకున్నాదని నిర్ణయించుకుని, వెళ్ళి, ఆ రెండు పెట్టెలూ తెరిచి చూసాడు. నగా నట్రా ఎరుపు రంగు పెట్టెలో ఉండడాన్ని గమనించాడు, తిరిగి  పెట్టెలకు తాళాలు వేసి, ఏమీ ఎరుగనట్టుగా వెళ్ళి పడుకున్నాడు.
      మర్నాడు ఉదయం అవ్వ తిక్కలోడిని రెండు పెట్టెలలోనూ ఒక దానిని ఎంచుకో మంది.
తిక్కలోడు బాగా ఆలోచించాడు. కాసేపు ఏం చేదామా అని గుంజాటన పడ్డాడు. ఆలోచనతో తల బ్రద్దలవుతోందే కానీ , ఒక నిర్ణయానికి రాలేక పోయేడు.
      అవ్వ దాచిన నగలూ, డబ్బూ అవీ ఎరుపు రంగు పెట్టెలో ఉన్నాయని తెలుసు ... కానీ సహజంగా వాడికుండే తిక్క గుణం వల్ల, నలుపు రంగు పెట్టెను ఎంచుకున్నాడు !
    కానీ, చిత్రం ! వాడు ఎంచుకున్న నలుపు రంగు పెట్టెలోనే అన్నీ ఉన్నాయి !
     అవ్వ నవ్వుతూ ‘‘ ఇవన్నీ ఇక నీవే! తీసుకో ! ’’ అంటూ పెట్టెను వాడి చేతిలో పెట్టింది.
తిక్కలోడు ఎప్పటిలాగే. నాకొద్దు పొమ్మన్నాడు!
    కానీ ,ఒక క్షణం పోయేక, అదంతా అవ్వ కావాలనే చేసిందని వాడికి తోచింది. తను ఆ రాత్రి పెట్టెలు రెండూ తెరవడం అవ్వ గమనించిందనీ, తనెలాగూ తలతిక్కగా నగలు ఉంచిన ఎరుపు రంగు పెట్టెను కాకుండా నలుపు రంగు పెట్టెనే తెరుస్తాడని ఊహించి, నగలూ. డబ్బూ దస్కం అందు లోకి మార్చివేసింది ! ఎలాగయినా తనకు అవి దక్కాలనే అవ్వ కోరిక అని వాడికి అర్ధమయిపోయింది.
    ‘‘ ఈ తిక్కలోడంటే, నీకెంత ఇష్టమే అవ్వా ! ’’ అనుకున్నాడు మురిపెంగా. ఆతరువాత వాడిలో మంచి మార్పు వచ్చింది. నాలుగు రోజులుండి తిరిగి వచ్చే ఒప్పందంతో అవ్వని తీర్ధయాత్రలకి స్వయంగా పంపించాడు. మరెప్పుడూ అవ్వ మనసు కష్ట పెట్టనని అవ్వకి ప్రమాణం చేసాడు.
  ఆ తర్వాతి రోజులలో ఊరివాళ్ళంతా వాడిని తిక్కలోడని కాకుండా, వాడి అసలు పేరుతోనే పిలవడం మొదలెట్టారు !
         ఇంతకీ వాడి అసలు పేరేమిటో చెప్పనే లేదు కదూ ?!
          తిక్కలోడు మాత్రం కాదు !